బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం  | Mass Shooting In Bangkok | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం 

Jul 28 2025 1:49 PM | Updated on Jul 29 2025 12:31 AM

Mass Shooting In Bangkok

ఆరుగురి మృతి 

ఆత్మహత్య చేసుకున్న దుండగుడు 

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం ఓ వ్యక్తి ఐదుగురిని కాల్చి చంపాడు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఆహారాన్ని విక్రయించే ఓర్‌ టోర్‌ కోర్‌ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. నలుగురు సెక్యూరిటీ గార్డులను, ఒక మహిళను కాల్చి చంపిన దుండగుడు చివరకు తనను తాను కాల్చుకున్నాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 

బ్యాంకాక్‌లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకటుఏ్టకునే చతుచక్‌ మార్కెట్‌కు కొద్ది దూరంలోనే ఈ ఓర్‌ టోర్‌ కోర్‌ మార్కెట్‌ ఉంది. దుండగుడు వరుస కాల్పులు జరుపుతుండగా ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుతున్న దృశ్యం, మృతదేహాలు వీధిలో చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యం మార్కెట్‌ సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. కాల్పుల తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అతడిని గుర్తించడానికి పోలీసులు ప్రయతి్నస్తున్నారు.

 ప్రస్తుతం థాయ్‌లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఘర్షణలకు, కాల్పులకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  థాయిలాండ్‌లో కాల్పులు చాలా సాధారణం. నియంత్రణ అమలులో లోపాల కారణంగా ఇక్కడ తుపాకీలు పొందడం చాలా సులభం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తుపాకీ హింస విపరీతంగా పెరిగింది.

 ఈ ఏడాది మేలో థాయ్‌లాండ్‌లోని యు థాంగ్‌ జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. 2023 అక్టోబర్‌లో బ్యాంకాక్‌లోని సియామ్‌ పారగాన్‌ మాల్‌లో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.చాలా మంది గాయపడ్డారు. 2022 అక్టోబర్‌లో జరిగిన మరో దారుణ సంఘటన జరిగింది. థాయ్‌ మాజీ పోలీసు ఒకరు పిల్లల సంరక్షణ కేంద్రంలో జరిపిన కాల్పుల్లో 24 మంది పిల్లలు సహా దాదాపు 36 మంది మరణించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement