Tamil Nadu: Governor RN Ravi Clears Online Gambling Bill - Sakshi
Sakshi News home page

తమిళనాట హైలైట్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్‌

Apr 10 2023 7:55 PM | Updated on Apr 10 2023 8:26 PM

Tamil Nadu Governor RN Ravi Clears Online Gaming Bill - Sakshi

గతకొద్దిరోజులుగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌ వర్సెస్‌ గవర్నర్‌్ ఆర్‌ఎన్‌‌ రవి అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. సీఎం స్టాలిన్‌, గవర్నర్‌ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్‌లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు గవర్నర్‌ వెంటనే ఆమోదం తెలిపారు. 

అయితే, అంతకుముందు.. సీఎం స్టాలిన్‌ సోమవారం రెండోసారి గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాము ప్రజల కోసం తీసుకొచ్చిన బిల్లును బహిరంగ వేదికపై గవర్నర్ విమర్శించారని, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కోరారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి.. గవర్నర్ గైడ్‌గా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం ప్రజలకు మంచి చేసేందుకు సిద్ధంగాలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.  

ఈ నేపథ్యంలో గవర్నర్‌ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్‌లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపారు. మరోవైపు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వద్ద మరో 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలన్న బిల్లు కూడా ఇందులో ఉన్నది.

ఇదిలా ఉండగా.. ఆన్‌లైన్‌ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తమిళనాడులో 40 మందికిపైగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆమోదించిన ఈ తరహా బిల్లును కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ బిల్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో,  తొలిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన 131 రోజుల తర్వాత గవర్నర్‌ గత నెలలో ఈ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి ఆమోదించి గవర్నర్‌కు రెండోసారి ఈ బిల్లును ప్రభుత్వం పంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement