
26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రాణా తన నేరాన్ని అంగీకరించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత విశ్వసనీయమైన ఏజెంట్గానూ తాను పనిచేశానని విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సోమవారం ఓ కథనం ప్రచురించింది.
ముంబై ఉగ్రదాడుల కేసులో అమెరికా నుంచి అప్పగింత మీద వచ్చిన రాణా.. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైలులో NIA కస్టడీలో ఉన్నాడు. అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణలో 2008 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రేమయం ఉన్నట్లు అంగీకరించాడు. అంతేకాదు తాను, తన మిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ద్వారా పలు శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నట్టు వెల్లడించాడు.
లష్కరే తోయిబా కేవలం ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదని ప్రధానంగా ఓ గూఢచార సంస్థలా పనిచేస్తుందని తహవూర్ రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఇమ్మిగ్రేషన్ సెంటర్ను ఓపెన్ చేయాలన్న ఆలోచన తనదేనని, ఆ కార్యాలయం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా చూపించానని, 2008 నవంబర్లో జరిగిన ముంబయి దాడుల సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని, అది ఉగ్రవాదుల ప్రణాళికలో భాగమే అని అంగీకరించాడు. దాడులకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి ప్రదేశాలను స్వయంగా పరిశీలించినట్టు తెలిపాడు. అంతేకాదు.. ఈ దాడులు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సహకారంతోనే జరిగాయని తాను నమ్ముతున్నట్లు తహవూర్ రాణా వెల్లడించాడు. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.
ఇదిలా ఉంటే.. ముంబై దాడుల్లో తన ప్రమేయం లేదంటూ రాణా ఇప్పటిదాకా బుకాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా విచారణలో తన పాత్రను అంగీకరించడంతో పాటు పాక్ నిఘా వ్యవస్థ ప్రేమయం ఉండొచ్చన్న వ్యాఖ్యలు ఈ కేసును కీలక మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.