కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోం | Supreme Court Rejects Gujarat Review Of Bilkis Bano Case Criticism | Sakshi
Sakshi News home page

కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోం

Sep 27 2024 3:49 AM | Updated on Sep 27 2024 3:49 AM

Supreme Court Rejects Gujarat Review Of Bilkis Bano Case Criticism

తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు

పరుçష వ్యాఖ్యల తొలగింపు కోసం గుజరాత్‌ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బానో రేప్, కుటుంబసభ్యుల హత్య కేసు దోషుల మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు(రెమిషన్‌) చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ గత తీర్పులో తాము చేసిన పరుష వ్యాఖ్యలను తొలగించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. కోర్టు వ్యాఖ్యానాల తొలగింపు అంశాన్ని పునర్‌సమీక్షించాలంటూ గుజరాత్‌ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ రివ్యూ పిటిషన్‌లో ఎలాంటి పస లేదు.

 గతంలో తీర్పు సందర్భంగా మేం చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ కోణంలో గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. దోషులు రెమిషన్‌పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్‌కు ఉంటుందని 2022 మేలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్‌ చెప్పడంతోనే తాము తుది నిర్ణయం తీసుకున్నామని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది. 

అయితే మహారాష్ట్రలోని సీబీఐ కోర్టులో కేసు విచారణ జరిగినందున రెమిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని గుజరాత్‌ బలవంతంగా లాక్కుందని, తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెల్సిందే. 11 మంది దోషుల రెమిషన్‌ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గోధ్రాలో రైలు దహనం ఉదంతం తర్వాత 2002లో గుజరాత్‌లో ముస్లింలపై దాడుల సందర్భంగా ఐదునెలల గర్భిణి అయిన బిల్కిస్‌ బానోను రేప్‌ చేసి, ఆమె మూడు నెలల కూతురుసహా ఏడుగురు కుటుంబసభ్యులను ఈ 11 మంది చంపేయడం తెల్సిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement