వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు | Supreme Court Bench Split On Abortion Case Of 26-Week Pregnancy Of Married Woman, Refers To Larger Bench - Sakshi
Sakshi News home page

వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు

Oct 12 2023 5:03 AM | Updated on Oct 12 2023 10:43 AM

Supreme Court Bench Split On Abortion Of 26-Week Pregnancy Of Married Woman - Sakshi

న్యూఢిల్లీ: గర్భ విచ్చిత్తికి సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్‌ బుధవారం భిన్న తీర్పుల్ని వెలువరించింది ఒక వివాహిత గర్భం దాలి్చన 26 వారాలకు గర్భవిచ్చిత్తి కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

దీనిపై  ఎయిమ్స్‌ ఇచి్చన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కొహ్లి పిండం గుండె ఆపేయాలని ఏ కోర్టు అయినా ఎందుకు చెబుతుందని ప్రశి్నస్తూ గర్భవిచ్ఛిత్తికి నిరాకరించారు. సుప్రీం బెంచ్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి. నాగరత్న దాంతో విభేదించారు. మహిళ నిర్ణయాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు.  వివరాల్లోకి వెళితే........

ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత మూడోసారి గర్భం దాల్చింది. అప్పటికే కుంగుబాటు సమస్యతో బాధపడుతున్న ఆమె మానసికంగా, ఆర్థికంగా తాను మరో పిల్లని పెంచడానికి సంసిద్ధంగా లేనని, అందుకే గర్భవిచ్చిత్తికి అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.  గర్భం దాల్చి 26 వారాల కావడంతో ఎయిమ్స్‌లో వైద్యులు ఆమెని పరీక్షించి అబార్షన్‌ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అక్టోబర్‌ 6న నివేదిక కూడా ఇచ్చారు.

ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ అక్టోబర్‌ 9న తీర్పు చెప్పింది.ఆ మహిళకు అబార్షన్‌ చేయాలని ఎయిమ్స్‌ వైద్యాధికారుల్ని ఆదేశించింది. అబార్షన్‌కు ముందు ఎయిమ్స్‌ డాక్టర్లు ఆమెని పరీక్షించి గర్భవిచ్చిన్నం చేసినా  శిశువు సజీవంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరో నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గర్భవిచ్చిత్తి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అక్టోబర్‌ 10న మరో పిటిషన్‌ దాఖలు చేసింది.

అత్యవసరంగా బుధవారం ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్‌ తొలుత ఎయిమ్స్‌లో మరో వైద్య బృందం గర్భవిచ్చిత్తి వల్ల వచ్చే ప్రమాదేమేమీ లేదని ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబర్‌ 6 న అబార్షన్‌కు ప్రమాదం లేదని వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు ? ఎందుకు ఆ దాపరికం ? నాలుగు రోజుల్లోనే ఎలా పరిస్థితి మారింది ? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటిపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గర్భ విచ్చిన్నం చేసినా శిశువు బతికే ఉంటుందని అంటే ఏ కోర్టు అయినా పిండం గుండె ఆపేయమని ఎందుకు చెబుతుంది ? అంటూ జస్టిస్‌ హిమాకొహ్లీ ప్రశ్నించారు.

నా వరకు నేనైతే అలాంటి పని చేయలేనన్న జస్టిస్‌ హిమ గర్భవిచ్చిత్తికి నిరాకరించారు.  మరో న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న అక్టోబర్‌ 9న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుని ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ మహిళ గర్భం తీసివేయడం పట్ల సుముఖంగా ఉన్నందున ఆమె నిర్ణయాన్ని గౌరవించాలంటూ గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ తీర్పు చెప్పారు. ఆ మహిళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు ఆమె శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా గర్భవిచ్చిత్తి చేయడమే సరైనదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ  కేసుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు పరిశీలనకు సిఫారసు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement