మోదీకి సోనియా సూటి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా మౌనం దాల్చడం దారుణమని కాంగ్రెస్ పార్లమెంటరీ పారీ్ట(సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా చిన్నారులు బలవుతున్నా భారత్ నోరుమెదపకపోవడం జాతీయ స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం, ఇజ్రాయెల్ దాడుల తీరును ఎండగడుతూ సోనియా గాంధీ తాజాగా ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. జాతీయ ప్రయోజనాలు, నైతికతను పణంగా పెట్టి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మైత్రికి నరేంద్ర మోదీ పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా మారణహోమానికి పాల్పడుతోందని జస్టిస్ ఎస్.మురళీధర్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి కమిషన్ జూన్ నెలలో విడుదల చేసిన 94 పేజీల నివేదిక కుండబద్దలు కొట్టిందని సోనియా గాంధీ గుర్తుచేశారు.


