కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు.. | Son Salute In Military Uniform For Colonel Killed In Action In Kashmir | Sakshi
Sakshi News home page

కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..

Sep 15 2023 6:35 PM | Updated on Sep 15 2023 7:12 PM

Son Salute In Military Uniform For Colonel Killed In Action In Kashmir - Sakshi

చండీగఢ్‌: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్‌లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు.

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్‌ప్రీత్‌ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్‌ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్‌ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

కల్నల్ మన్‌ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్‌ప్రీత్  ప్రాణాలు కోల్పోయారు.

ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్‌ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్‌లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. 

ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్..

Advertisement
 
Advertisement
Advertisement