
చెన్నై: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆవినీతి ఆరోపణల నేపథ్యంతో అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ మేరకు గురువారం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ‘జాబ్స్ పర్ క్యాష్, మనీలాండరింగ్తో సహా అనేక అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెంథిల్ను గవర్నర్ మంత్రివర్గం నుంచి ఆయన్ను తొలగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని రాజ్ భవన్ ప్రకటనలో పేర్కొంది.
కాగా జూన్ 14న తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసాలు, కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
చదవండి: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్కు రాక
సెంథిల్ బాలాజీ రాజకీయ ప్రస్థానం
బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్ హోదా లభించలేదు.
2017లో అనర్హత వేటు
అన్నాడీఎంకేలో చీలిక తర్వాత బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్కు మద్దతు తెలిపాడు. 2017లో ముఖ్యమంత్రిని మార్చాలంటూ అప్పటి గవర్నర్కు పిటిషన్ అందించినందుకు.. అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బాలాజీ 2018లో డీఎంకేలో చేరి అరవకురిచ్చి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019లో అదే నియోజకవర్గం నుంచి, 2021లో కరూర్ నుంచి గెలిచారు.
సీఎంకు సన్నిహిత వ్యక్తిగా
బాలాజీ ముఖ్యమంత్రి స్టాలిన్కు సన్నిహిత వ్యక్తిగా పేరుగాంచడంతో మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అన్నాడీఎంకే నుంచి మారినప్పటికీ అతనికి ముఖ్యమైన శాఖలను కేటాయించాడు. అనంతరం బాలాజీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి గెలుపొందిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. టెండర్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని బార్ యజమానులు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. కొంతమంది బార్ యజమానులు అతని పేరు మీద నెలవారీ రక్షణ డబ్బును డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు.