ఎంపీ సంజయ్‌ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు | Sawant Files Defamation Case Against MP Sanjay Singh | Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు

Dec 17 2024 9:28 PM | Updated on Dec 17 2024 9:29 PM

Sawant Files Defamation Case Against MP Sanjay Singh

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు భారీ షాక్‌ తగిలింది. క్యాష్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌ సింగ్‌పై గోవా సీఎం ప్రమాద్‌ సావంత్‌ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్‌ సింగ్‌కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.  

ప్రమోద్‌ సావంత్‌ భార్య సులక్షణ సావంత్‌ ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లోని సివిల్‌ జడ్జి సీనియర్‌ డివిజన్‌ ​​కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్‌ పాయ్‌ వెర్నేకర్‌ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్‌ వెల్లడించారు.  

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ సింగ్‌ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement