నాటి ఇందిర ట్విస్ట్ నుండి నేటి శివసేన చీలిక వరకూ.. | The Rebellion Blueprint: Inside Story of Maharashtras Chaotic Political History | Sakshi
Sakshi News home page

నాటి ఇందిర ట్విస్ట్ నుండి నేటి శివసేన చీలిక వరకూ..

Jun 21 2026 7:53 AM | Updated on Jun 21 2026 11:11 AM

The Rebellion Blueprint: Inside Story of Maharashtras Chaotic Political History

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న హైడ్రామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరాఠా గడ్డపై పార్టీల చీలికలు, అర్ధరాత్రి ప్రభుత్వాల ఏర్పాటు, నమ్మినవారే నట్టేట ముంచడం వంటి పరిణామాలు ఈనాటివి కావు. 1960ల కాలం నుండి సాగుతున్న ఈ అధికార వ్యూహ ప్రతివ్యూహాల వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. నాటి కాంగ్రెస్ విభజన, శరద్ పవార్ తొలి తిరుగుబాటు నుండి నేటి శివసేన సంక్షోభం వరకు మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న సంచలనాలివే..

కాంగ్రెస్ చారిత్రాత్మక చీలిక: ఇందిరా గాంధీ బహిష్కరణ
భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన అత్యంత కీలకమైన ఘట్టం నవంబర్ 1969లో చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల సమయం నుండి కాంగ్రెస్‌లో రాజుకుంటున్న విభేదాలు.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బహిష్కరించేలా చేశాయి. పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ ఇందిరకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోగా, ఇందిరా గాంధీ మాత్రం మెజారిటీ ఎంపీల మద్దతు తనకే ఉందంటూ తిరుగుబాటు చేశారు. 167 మంది ఎంపీల మద్దతుతో ఆమె కాంగ్రెస్ (ఆర్) గ్రూపును ఏర్పాటు చేసి తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

38 ఏళ్ల వయసులోనే సీఎం.. శరద్ పవార్ తొలి తిరుగుబాటు
1969 కాంగ్రెస్ చీలిక తర్వాత మహారాష్ట్రలో యశ్వంతరావు చవాన్, ఆయన శిష్యుడైన శరద్ పవార్ ఇందిరా గాంధీ పక్షాన నిలిచారు. అయితే, 1977 అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత కాంగ్రెస్ మరోసారి విడిపోయింది. ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ) ఏర్పాటు చేయగా, చవాన్, పవార్ కాంగ్రెస్ (యు) లో ఉండిపోయారు. ఆ తర్వాత జనతా పార్టీని అధికారానికి దూరంగా ఉంచేందుకు రెండు కాంగ్రెస్ గ్రూపులు చేతులు కలిపి వసంత్‌దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ 1978లో శరద్ పవార్ కేవలం 38 ఏళ్ల వయసులో కాంగ్రెస్ (యు) నుండి విడిపోయి, జనతా పార్టీ మద్దతుతో 'ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్' కూటమిని ఏర్పాటు చేసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

మరాఠా గడ్డపై శివసేన శకం.. బీజేపీతో దోస్తీ
కాంగ్రెస్ అంతర్గత పోరు నడుస్తున్న సమయంలోనే, 1966లో బాల్ కేశవ్ థాకరే (బాలాసాహెబ్ థాకరే) శివసేన పార్టీని స్థాపించారు. ముంబై వేదికగా మరాఠీ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, దూకుడు రాజకీయాలతో క్షేత్రస్థాయిలో ఈ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. ఇదే క్రమంలో హిందుత్వ ఎజెండాతో బీజేపీతో శివసేనకు 25 ఏళ్ల సుదీర్ఘ బంధం కుదిరింది. మహారాష్ట్రలో శివసేన పెద్దన్న పాత్ర పోషించగా, 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక  రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో ఈ సమీకరణలు మారడం ప్రారంభించాయి. 1995లో మొదటిసారి శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మనోహర్ జోషి సీఎం అయ్యారు.

విదేశీ మూలాల వివాదం: ఎన్సీపీ ఆవిర్భావం
1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల అంశాన్ని తెరపైకి తెస్తూ శరద్ పవార్ కాంగ్రెస్ నుండి రెండోసారి బయటకు వచ్చారు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. విడిపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఎన్సీపీ చేతులు కలిపి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ తర్వాత పవార్ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఐదు రోజుల ముచ్చటైన ప్రభుత్వం.. మహా వికాస్ అఘాడీ
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ సీఎం పదవి విషయంలో వచ్చిన విభేదాలతో కూటమి విడిపోయింది. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం సంచలనం సృష్టించింది. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఐదు రోజులే నిలిచింది. శరద్ పవార్ వ్యూహాత్మకంగా తన ఎమ్మెల్యేలను కాపాడుకుని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలను కలిపి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిని తెరపైకి తెచ్చారు. దీనితో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.

2026 కొత్త సంక్షోభం.. ఉద్ధవ్ చేజారిన ముంబై కోట
జూన్ 2022 లో ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు కూడా షిండే వశమయ్యాయి. ఆ మరుసటి ఏడాది 2023 లో అజిత్ పవార్ సైతం ఎన్సీపీని చీల్చి షిండే ప్రభుత్వంలో చేరారు. కాగా, 2026 లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) మరో భారీ చీలిక వైపు వెళ్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరుగురు లోక్‌సభ ఎంపీలు స్పీకర్‌కు లేఖ ఇవ్వడం, ఢిల్లీ సమావేశానికి గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా ఉద్ధవ్ చేతిలో ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ తన మేయర్‌ను కూర్చోబెట్టడంతో ప్రస్తుతం ఉద్ధవ్ కేవలం ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌కు పరిమితమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement