
న్యూఢిల్లీ: రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అతని జ్ఞాపకాలు, రచనలు నిత్యం మనతోనే ఉంటాయి. రతన్ టాటా చూపిన దాతృత్వానికి సంబంధించిన అనేక ఉదాహణలు మనకు కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త సుహైల్ సేథ్.. రతన్ టాటా చాటిన మానవత్వానికి సంబంధించిన ఒక ఘటనను పంచుకున్నారు.
ఫిబ్రవరి 2018లో బ్రిటీష్ రాజకుటుంబం రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకుంటున్నట్లు సుహైల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ స్వయంగా రతన్ టాటాకు ఈ బిరుదును ఇవ్వాలనుకున్నారు. అయితే రతన్ టాటా బ్రిటన్ వచ్చేందుకు నిరాకరించారు. అయితే దీని వెనుకగల కారణాన్ని తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ రతన్ టాటాను మానవతావాదిగా కొనియాడారు.
ఈ ఆసక్తికరమైన కథనాన్ని సుహైల్ సేథ్ వివరించారు. 2018, ఫిబ్రవరి 6న ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్లో రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకున్నారు. బకింగ్హామ్ ప్యాలెస్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుహైల్ సేథ్ ఫిబ్రవరి 3న లండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సమయంలో సుహైల్ సేథ్ తన ఫోన్ని చూసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో రతన్ టాటా నుండి 11 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీటిని చూసిన సుహైల్ సేథ్ వెంటనే రతన్ టాటాకు ఫోన్ చేయగా, రతన్ టాటా తాను ఆ అవార్డుల ఫంక్షన్కి రాలేనని చెప్పారు. తన పెంపుడు శునకాలు టాంగో, టిటోలు అనారోగ్యంతో ఉన్నాయని వాటిని విడిచిపెట్టి, ఈ అవార్డుల ఫంక్షన్కి రాలేనని చెప్పారు. ఈ సమాధానం విన్న సుహైల్ సేథ్ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను మానవత్వం కలిగిన మహనీయునిగా జంతు ప్రేమికునిగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్ ప్రశంసలు