సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్‌  | Police Arrested Saif Ali Khan Attacker In Chattisgarh | Sakshi
Sakshi News home page

సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్‌ 

Jan 18 2025 7:06 PM | Updated on Jan 19 2025 5:08 AM

Police Arrested Saif Ali Khan Attacker In Chattisgarh

దుర్గ్‌: నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ రైల్వే స్టేషన్‌లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్‌ టెరి్మనస్‌(ఎలీ్టటీ)నుంచి కోల్‌కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్‌ కైలాశ్‌ కనోజియా(31)గా గుర్తించారు. 

సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్‌లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్‌ రైల్వే పోలీసులను అలెర్ట్‌ చేశారు. అనుమానితుడి సెల్‌ ఫోన్‌ లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను షేర్‌ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్‌ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్‌నంద్‌గావ్‌ స్టేషన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్‌నంద్‌గావ్‌లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. 

దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్‌ రైల్వే స్టేషన్‌లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్‌ బోగీలో ఉన్న ఆకాశ్‌ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్‌పూర్‌ వెళ్లి ఆకాశ్‌ కైలాశ్‌ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement