1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్‌ ఫీజులు | Passport fees to increase from 1st july | Sakshi
Sakshi News home page

1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్‌ ఫీజులు

Jun 26 2026 4:06 AM | Updated on Jun 26 2026 4:06 AM

Passport fees to increase from 1st july

14 ఏళ్ల తర్వాత రుసుములను సవరించిన కేంద్రం

ఇకపై సాధారణ పాస్‌పోర్ట్‌ రూ.2,500 

తత్కాల్‌లో అయితే రూ.5 వేలు

చిన్నారులు, సీనియర్‌ సిటిజన్లకు రాయితీ యథాతథం

జూన్‌ 30లోపు దరఖాస్తు చేసుకుంటే పాత ఫీజులే

సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ దరఖాస్తు, ఇతర సేవల ఫీజులను భా రీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సవరించిన కొత్త ఫీజులు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 2012 తర్వాత, దాదాపు 14 ఏళ్ల విరామం అనంతరం పాస్‌పోర్ట్‌ నిబంధనలు–1980ని సవరిస్తూ ప్రభుత్వం ఈ మేరకు రుసుము లను పెంచింది. దీంతో సాధారణ, తత్కాల్‌ పాస్‌పోర్టులతో పాటు పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తదితర సేవల ఫీజులు సైతం పెరిగాయి. ఈనెల 20వ తేదీన విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ను గురువారం విదేశాంగ శాఖ ప్రచురించింది.

రూ.1,500 నుంచి రూ.2,500కు..
36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ ఫీజు ఇప్పటివరకు రూ.1,500 ఉండగా, ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే 36 పేజీల పాస్‌పోర్ట్‌ను తత్కాల్‌ విధానంలో వేగంగా పొందాలంటే గతంలో ఉన్న రూ.3,500 ఫీజు రూ.5,000కు చేరింది. తరచూ విదేశాలకు వెళ్లే వారు తీసుకునే 60 పేజీల జంబో పాస్‌పోర్ట్‌ ఫీజులు కూడా పెరిగాయి. ఈ కేటగిరీ పాస్‌పోర్ట్‌ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు పెరిగింది. అత్యవసరంగా తత్కాల్‌లో 60 పేజీల పాస్‌పోర్ట్‌ కావాలంటే రూ.4,000కు బదులుగా ఇకపై రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.

పాస్‌పోర్ట్‌ పోయినా, చిరిగిపోయినా.. 
కొత్త పాస్‌పోర్టులకే కాకుండా పాస్‌పోర్ట్‌ పోయి నా, చిరిగిపోయినా, మరేరకంగా దెబ్బతిన్నా కొత్తది పొందడానికి చెల్లించే ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. 36 పేజీల రీప్లేస్‌మెంట్‌ పాస్‌ పోర్ట్‌కు సాధారణ కేటగిరీలో రూ.5,000, తత్కాల్‌లో అయితే రూ.7,500 వసూలు చేయనున్నారు. 60 పేజీల పాస్‌పోర్ట్‌ పోయి కొత్తది కావాలంటే సాధారణంగా రూ.6,000, తత్కాల్‌ విధానంలో అయితే ఏకంగా రూ.8,500 చెల్లించాలి. వీటితో పాటు పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ), సరెండర్‌ సర్టిఫికెట్స్‌ వంటి కీలక సేవల రుసుములు కూడా పెరగనున్నాయి.

కొనసాగనున్న రాయితీలు.. 
పాస్‌పోర్ట్‌ ఫీజుల పెంపు దరఖాస్తుదారులపై ఆర్థిక భారం మోపినప్పటికీ, కొన్ని వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 8 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం ఫీజు రాయితీని మునుపటి లాగే కొనసాగించనున్నారు. ఇదిలా ఉండగా పాత రేట్లతోనే పాస్‌పోర్ట్‌ పొందాలనుకునే వారు జూన్‌ 30, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూలై 1 నుంచి స్లాట్‌ బుక్‌ చేసుకునే వారు మాత్రం పెరిగిన కొత్త ఫీజుల ప్రకారమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement