ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు.. ఇటు మారుతి సుజుకి ఓ కారును మార్కెట్లోకి తెస్తే.. అటు హీరో కంపెనీ బైక్లను దించింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఈ85 పెట్రోలు బంకు కూడా ప్రారంభమైంది. ఈ పరిణామాలను ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థ దిశగా మన దేశం వేసిన ఓ కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఏమిటి? ఇది ప్రాచుర్యం పొందుతుందా? ఉన్న సమస్యలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం..
అసలు ఏంటివి?
పెట్రోలులో ఎంత శాతం ఇథనాల్ కలిపినా నడిచేలా రూపొందించినవే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు. మన దేశం విషయానికొస్తే.. ఇంజన్కు ఎలాంటి నష్టం చేయకుండా.. ఈ20–ఈ100 ఇంధన మిశ్రమంతో ఇవి నడుస్తాయి. అయితే, ఇథనాల్ లోహాన్ని కరిగించే లేదా తినేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజిన్కు నష్టం జరగకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేక సెన్సర్లు, ఇథనాల్ నిరోధక ఇంధన పైపులు, సీల్స్ను అమరుస్తారు. వాస్తవానికి ఈ సాంకేతికత కొత్తది కాదు. 2000ల ప్రారంభంలోనే ఫోక్స్వ్యాగన్ వీటిని బ్రెజిల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడక్కడ అమ్ముడయ్యే వాహనాల్లో 80 శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే కావడం గమనార్హం.
ప్రజల నుంచి ఆదరణ ఉంటుందా?
ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ85 ఇంధనం పెట్రోలుతో పోలిస్తే.. లీటరుకు సుమారు రూ.20 తక్కువకు వస్తోంది. అయితే, ఈ వాహనాల తయారీ వ్యయం అధికంగా ఉండటం వల్ల అమ్మకపు ధరలు కూడా ఎక్కువగా ఉండటం.. ఇథనాల్ మిశ్రమం పెరిగే కొద్దీ మైలేజ్ కొంతమేర తగ్గే అవకాశమున్నందున ఈ అంశాల ప్రభావం వినియోగదారులపై పడే అవకాశముంది. ఈ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై చర్చలు జరిగినప్పటికీ కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల పన్ను రాయితీలతోపాటు ఇథనాల్ మిశ్రమ ఇంధన ధరను కూడా మరింత తగ్గించే దిశగా ప్రోత్సాహకాలు అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మార్కెట్ పరిస్థితి ఏమిటి?
2031–32 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్ వాహనాలు కలిపి 5 శాతం వాటాను దక్కించుకుంటాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పశ్చిమాసియా పరిణామాలు, ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ప్రాధాన్యమిస్తోంది.
కంపెనీలు ఏమనుకుంటున్నాయి?
ప్రస్తుతం హీరో, మారుతి సంస్థలు పరిమిత స్థాయిలోనే వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటి తయారీ వ్యయం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై స్పష్టత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. అదే సమయంలో ఇథనాల్ కలిపిన ఇంధనం తక్కువ ధరలో వస్తున్నప్పటికీ.. ఈ వాహనాల ధరలు ఎక్కువగా ఉండటంతో వీటికి ప్రజల ఆదరణ ఎలా ఉంటుందన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో కంపెనీలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి.
ఫ్లెక్స్ ఫ్యూయల్ సరఫరా తగినంత ఉందా?
ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. భారత్ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2,000 కోట్ల లీటర్లు. ప్రస్తుతమున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధన లక్ష్యానికి అవసరమయ్యే పరిమాణం(1,100 కోట్ల లీటర్లు) కంటే ఇది ఎక్కువ. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం పెరిగినా.. ఈ మేరకు సరఫరాను పెంచే సామర్థ్యం పరిశ్రమకు ఉందని నిపుణులు చెబుతున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్


