తెలంగాణ: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్‌.. తగ్గేది మాత్రం అప్పుడే! | Sakshi
Sakshi News home page

Omicron Variant-Telangana: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్‌.. తగ్గేది మాత్రం అప్పుడే!

Published Thu, Jan 27 2022 11:04 AM

Omicron Variant Sreading May End In Feburary Gastroenterologist Dr Guru N Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్‌ ఆసుపత్రుల చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్‌ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై డాక్టర్‌ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

80 శాతం మందికి వైరస్‌... 
మీజిల్స్‌ వైరస్‌ తీవ్రంగా విస్తరిస్తుంది అనుకున్నాం. కానీ ఒమిక్రాన్‌ దానిని మించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది వైరస్‌ బారినపడతారు. 50 నుంచి 80 శాతం వేగంతో విస్తరిçస్తున్నందున త్వరగా ఇన్ఫెక్ట్‌ చేస్తుంది. దగ్గు, జలుబు తుంపర్ల ద్వారా ఇది విస్తరిస్తుంది. మాస్క్‌ లేకుండా ఉంటే మరింత వేగంగా విస్తరిస్తుంది. ఇళ్లలో ఒకరికి వస్తే ఇతరులకూ వ్యాపిస్తుంది.  
(చదవండి: ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్‌)



ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్‌ చేయదు 
ఒమిక్రాన్‌ సోకినప్పుడు ఎక్కువ కేసుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. గొంతులో ముక్కులో ఉండే వైరస్‌ ఇది. ఊపిరితిత్తులను ఇన్పెక్ట్‌ చేయదు.  

డెల్టా మందులు పనికిరావు 
డెల్టాకు వాడే మందులు ఒమిక్రాన్‌కు పనికిరావు. డెల్టాకు స్టెరాయిడ్స్, రెమిడిసివిర్, మోనొక్లోనాల్‌ యాంటీబాడీస్‌ ఉపయోగించాం. కానీ ఒమిక్రాన్‌కు ‘మాన్‌లువిరపిర్‌’అనే మాత్ర వేసుకోవాలి. ఇది ఎం తో సురక్షితమైంది. మొదటి రెండ్రోజులు జ్వరం అ లాగే ఉంటే ఈ మందు వేయొచ్చు. కానీ గర్భిణిలు, త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇవ్వకూడదు. ఈ మందు తీసుకున్న ఆరు నెలల వరకు ప్రెగ్నెన్నీ కో సం ప్రయత్నించకూడదు. కొందరు అనుభవం లేని డాక్టర్లు ఇప్పటికీ అనవసరంగా క్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, యాంటీబయోటిక్‌ మందులు ఇస్తున్నారు. 

డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవచ్చు 
ఎస్‌ జీన్‌ ఆర్టీపీసీఆర్‌ కోవిడ్‌ టెస్ట్‌చేస్తే అందులో ఒమిక్రానా లేదా డెల్టా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలు ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ప్రైవేట్‌ పరీక్ష కేంద్రాల్లో కొన్నిచోట్ల చేస్తున్నారు. మేము మా ఆస్పత్రిలో రూ.1,200 తీసుకుని ఔట్‌ పేషెంట్లకు, అవసరమైన వారికి కూడా చేస్తున్నాం.  
డోలో వేసుకుంటే చాలు: ఒమిక్రాన్‌లో జ్వరం వస్తే డోలో వేసుకుంటే సరిపోతుంది. ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండి, చివరి 24 గంటల్లోపు జ్వరం లేకుంటే సాధారణ జీవనంలోకి రావొచ్చు. డోలో వేసుకున్నా రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.  

ఇది సోకితే భవిష్యత్తులో కోవిడ్‌ రాదు 
ఒమిక్రాన్‌ వచ్చిపోయిన వారికి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏళ్లపాటు ఉంటుందంటున్నారు. మళ్లీ భవిష్యత్తులో కోవిడ్‌ రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఒమిక్రాన్‌ వచ్చినవారికి డెల్టా వేరియంట్‌ వచ్చే అవకాశం ఉండదు. కానీ డెల్టా వచ్చిన వారికి ఒమిక్రాన్‌ వస్తుంది.  

బూస్టర్‌తో మెరుగైన రక్షణ 
రెండు వ్యాక్సిన్ల తర్వాత బూస్టర్‌ తీసుకోవాలని సూచిస్తున్నాం. మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఒమిక్రాన్‌ వచ్చినా 90 శాతం మందికి ఐసీయూకు వెళ్లే ప్రమాదం ఉండదు. మరణాలు ఉండవు.  

అలసట, తలనొప్పి ఉంటాయి 
ఒమిక్రాన్‌ వచ్చి తగ్గిన తర్వాత మూడు నాలుగు వారాల వరకు అలసట, తలనొప్పి, ఆందోళనతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. ఒమిక్రాన్‌ వైరస్‌ వెన్నెముక ద్రవంలోకి చేరుకొని, తర్వాత మెదడుకు చేరుకొని అక్కడ వాపు తీసుకొస్తుంది. దీనివల్ల నాలుగైదు వారాలు పై సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా పట్టక పోవడం ఉంటుంది.  

పిల్లలు తట్టుకుంటున్నారు 
పిల్లలు ఒమిక్రాన్‌ను తట్టుకుంటున్నారు. ఎవరికీ ఏమీ కావట్లేదు. తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చి చూపిస్తున్నారు.  

10% కంటే తక్కువ ఐసీయూ ఆక్యుపెన్సీ 
హైదరాబాద్‌లో మాలాంటి ఐదారు పెద్దాసుపత్రుల్లోని ఐసీయూల్లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. కొందరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. కొందరు కొత్త మందుల కోసం వస్తున్నారు. 

మన ప్రభుత్వాలను అభినందించాలి 
మన దేశంలో వ్యాక్సినేషన్‌ బాగా జరగడం వల్ల మరణాలు పెద్దగా లేవు. మరణించేవారిలో 90 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారే. వ్యాక్సినేషన్‌తో ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణ , ఏపీల్లో పీహెచ్‌సీల్లో సైతం వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వాలను అభినందించాలి.  
(చదవండి: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్‌ హెల్మెట్‌కు బై బై?)

Advertisement
Advertisement