ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై స్పష్టత వచ్చే వచ్చే వరకు లోక్సభకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.
లోక్సభ సమావేశాలు ప్రారంభం నుంచి స్పీకర్ ఓంబిర్లా సభ నిర్వహణలో పక్షపాతం చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడకుండా మైక్ కట్ చేయడం, సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం వంటి కారణాలను ఉదహరించాయి. అదే సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్ మహిళా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్గా ఓంబిర్లా అనర్హులు అంటూ ఆయనపై 120మంది ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం జారీ చేశారు.
ఈ సందర్భంగా లోక్సభను ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ ఓంబిర్లాను ఆర్టికల్ 94(సీ) నిబంధనల ప్రకారం ఆయన్ను పదవి నుంచి తొలగించే అధికారం ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
దీంతో పాటు లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వివాదానికి దారితీసింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’ అనే పుస్తకం రాశారు. కానీ అది ఇంకా పబ్లిష్ కాలేదు. నరవణే పుస్తకంలో 2020లో తూర్పు లద్దాఖ్లో చైనాతో సైనిక ప్రతిష్టంభన,గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళిక, ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన సంభాషణతో పాటు పలు సున్నిత అంశాలు అందులో పేర్కొన్నారు. అయితే కారవాన్ మ్యాగజైన్లో ఈ పుస్తకంపై వచ్చిన ఆర్టికల్లోని కొన్ని భాగాలను రాహుల్ చదివే ప్రయత్నం చేశారు. అందుకు ఓంబిర్లా ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారం లోక్సభలో పబ్లిష్ అవ్వని పుస్తకాన్ని సభలో ఉదహరించకూడదు సూచించారు.
నరవణే రాసిన పుస్తకం పబ్లిష్ కానప్పటికీ రాహుల్ గాంధీకి చేతికి ఆ పుస్తకం ఎలా వెళ్లిందనేది ప్రశ్నార్ధకంగా ఉంది. దీనిపై అధికార ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుస్తకంలోని అంశాల గురించి ప్రస్తావించేందుకు ఓంబిర్లా అనుమతి ఇవ్వలేదనే కారణంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తేలింది.


