Odisha Train Accident: Bahanaga High School Building To Be Demolished - Sakshi
Sakshi News home page

ఒడిశా విషాదం: మృతదేహాలను ఉంచిన స్కూల్‌ కూల్చివేత! కారణం ఇదే..

Published Fri, Jun 9 2023 1:13 PM

Odisha Train Crash Bahagana School To Be Demolished  - Sakshi

బాలాసోర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన బాహాగానా హైస్కూలును కూల్చివేసినట్లు తెలిపారు ఆ పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజారామ్ మోహాపాత్ర. శవాలను ఉంచిన చోటకు తిరిగి రావడానికి విద్యార్థులు జంకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. 

పిల్లలు భయపడుతున్నారు.. 
బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వారి బంధువులు వచ్చి తీసుకుని వెళ్లేంత వరకు బాహాగానా హైస్కూల్లోనే ఉంచారు. ఇక్కడి నుండి మృతదేహాలను తరలించిన తర్వాత స్కూలు గదులన్నిటినీ శుభ్రం చేసి శానిటైజ్ చేశాము. అయినా కూడా పిల్లల తలిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించడానికి ఇష్టపడటం లేదు. దీంతో స్కూలుని కూల్చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. కొత్త భవనం నిర్మించి పూజలు నిర్వహించి పవిత్రం చేసిన తర్వాత స్కూలును పునః ప్రారంభిస్తామని అన్నారు రాజారామ్ మోహాపాత్ర. 

కలెక్టర్ ఆదేశాలు.. 
అంతకు ముందు బాలాసోర్ జిల్లా కలెక్టర్ భావుసాహెబ్ షిండే పాఠశాలను సందర్శించి స్కూలు మేనేజింగ్ కమిటీ నిర్ణయిస్తే స్కూలును కూల్చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే పాఠశాల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుని స్కూలు కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు.  

ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సహాయాక చర్యల్లో భాగంగా మృతదేహాలను వెలికితీసిన వెంటనే  వాటిని దగ్గర్లో ఉన్న బాహాగానా హైస్కూలుకు తరలించారు. మృతుల బంధువులు వచ్చి మృతదేహాలను గుర్తించేంత వరకు రోజులపాటు మృతదేహాలను అక్కడే ఉంచడంతో నేలంతా రక్తపు మరకలు అంటుకుని ఉంది. ఎంత కడిగినా కూడా పిల్లల మనస్సులో నుంచి భయాన్ని తొలగించలేమన్నది తల్లిదండ్రుల వాదన.   

ఇది కూడా చదవండి: శవాలు కుళ్ళిపోతున్నాయి... ఎన్నాళ్లిలా?

Advertisement
Advertisement