
న్యూఢిల్లీ: భారత్ వస్తువులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన వేళ రక్షణ ఒప్పందాలను నిలిపి వేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది.
అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆర్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను భారత ప్రభుత్వం ఆపేసిందంటూ వస్తున్న వార్తలు అసత్యాలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. టారిఫ్ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అమెరికా వెళ్లి, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. అయితే, ఆ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
టారిఫ్ల పెంపు వేళ..రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం సడలిన మాట వాస్తవమేనని, అయితే దీని ప్రభావం రక్షణ సంబంధాలపై ప్రత్యక్షంగా పడబోదని ఐజీ డ్రోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ మేజర్ జనరల్ పధి విశ్లేషించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 20 వరకు రక్షణ ఒప్పందాలున్నాయన్నారు. అమెరికాకు చెందిన అపాచీ, చినూక్, పీ–81 విమానాలు, ఎంక్యూ–9 డ్రోన్లను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, వీటిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు.