హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు | Nine Trekkers From Bengaluru Dead In Uttarakhand | Sakshi
Sakshi News home page

Uttarakhand: హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు

Jun 7 2024 10:53 AM | Updated on Jun 7 2024 1:43 PM

Nine Trekkers From Bengaluru Dead In Uttarakhand

ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వతాలలో విహారయాత్రకు వెళ్లి ఉత్తరకాశీ జిల్లా సహస్ర తాల్‌ వద్ద మంచు తుపానులో చిక్కుకున్న కన్నడిగుల విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది.

యశవంతపుర: ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వతాలలో విహారయాత్రకు వెళ్లి ఉత్తరకాశీ జిల్లా సహస్ర తాల్‌ వద్ద మంచు తుపానులో చిక్కుకున్న కన్నడిగుల విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సుమారు 18 మంది బెంగళూరు గత నెలాఖరులో హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కానీ మంగళవారం సంభవించి మంచు తుపానులో 5 మంది మరణించి, 9 మంది గల్లంతయ్యారు. గురువారానికి మృతుల సంఖ్య 9 కి పెరిగింది.

కన్నడిగుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చే విషయంపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మంత్రి కృష్ణబైరేగౌడ చర్చలు జరిపారు.  గురువారం ఉదయం 11 గంటలకు 9 మృతదేహాలకు ఉత్తరకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. అక్కడి నుంచి విమానంలో డెహ్రాడూన్‌కు తరలించారు. మరణించిన తొమ్మిది మంది ట్రెక్కర్ల మృతదేహాలలో ఐదుగురి మృతదేహాలు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాయి. మిగిలిన నాలుగు మృతదేహాలు మరో విమానంలో చేరుకోనున్నాయి.

 

మృతులు వీరే  
మృతుల్లో ముగ్గురు పురుషులు, ఆరుమంది మహిళలు ఉన్నారు. ఇందులోనే మృతుడు సుధాకర్‌ (71) ఉన్నారు. ఆయనే కర్ణాటక మౌంటెనీరింగ్‌ సంఘం (కేఎంఏ)ని స్థాపించి తరచూ ఔత్సాహికులను హిమాయల పర్వతాల అధిరోహణకు తీసుకెళ్లేవారని తెలిసింది. మిగతా మృతుల వివరాలు.. సింధు వకీలం (44), సుజాత ముంగుర్‌వాడి (52), ఆమె భర్త వినాయక్‌.బి (52), చిత్రా ప్రణీత్‌ (48), కె.వెంకటేష్‌ ప్రసాద్‌ (53), కేపీ పద్మనాభ (50), అనితా రంగప్ప (55), పద్మిని హెగ్డే (34) ఉన్నారు. వీరందరూ బెంగళూరు వాసులే. తమవారు ఇక లేరని తెలిసి వారి పిల్లలు, జీవిత భాగస్వాములు తీవ్ర శోకంలో మునిగిపోయారు.     

Advertisement
 
Advertisement
Advertisement