
ఢిల్లీ: నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. తిరిగి కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో తెలిపింది.
NEET UG counselling deferred until further notice: Official sources pic.twitter.com/VVMvpGwDDH
— ANI (@ANI) July 6, 2024
నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కౌన్సెలింగ్ను వాయిదా వేసేందుకు మాత్రం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పిటిషన్లను అన్నింటిని ఒక్కటిగా జూలై 8న(ఎల్లుండి) విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీయే నీట్ కౌన్సిలింగ్ను వాయిదా వేసి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.
మరోవైపు.. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజి కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తన అఫిడవిట్లో వెల్లడించింది.