NEET UG Result 2024: నీట్‌లో ఆరుగురి ఫస్ట్‌ ర్యాంకు గల్లంతు! | NEET UG 2024: Number of top rankers to go down to 61 from 67 | Sakshi
Sakshi News home page

నీట్‌లో ఆరుగురి ఫస్ట్‌ ర్యాంకు గల్లంతు!

Jun 20 2024 5:53 AM | Updated on Jun 20 2024 5:53 AM

NEET UG 2024: Number of top rankers to go down to 61 from 67

న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్‌ గ్రాడ్యుయేట్‌(నీట్‌–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్‌ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్‌ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. 

వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి. 

నీట్‌–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్‌టీఏ పునర్‌ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్‌ఏటీ స్పష్టంచేసింది. 

యథాతథంగా కౌన్సెలింగ్‌!  
నీట్‌ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌ నిలిపివేసేందుకు నిరాకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement