
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలోని పలు రోడ్లు, భవనాల పేర్లు త్వరలోనే మారిపోనున్నాయి. ఆయా ప్రాంతాలు నూతన పేర్లతో, పలు హంగులు సంతరించుకోనున్నాయి.
నగరంలోని గిరిజాఘర్ రహదారికి భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు పెట్టనున్నారు. ఫాత్మాన్ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డుగా మారనుంది. మక్బుల్ ఆలం రోడ్డు.. బిర్హా గాయకుడు పద్మశ్రీ హీరాలాల్ యాదవ్ రోడ్డుగా మారనుంది. వారణాసి మేయర్ అశోక్ తివారి ఈ మార్పులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కాశీ నగరం ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా పేరొందిందని అశోక్ తివారి పేర్కొన్నారు. ఇక్కడి ప్రాచీనత, ఆధ్మాత్మికత, కళలు, సాహిత్యం, సంప్రాదాయం మానవాళికి మార్గదర్శక మన్నారు.
నగరంలోని పలు రహదారులు, భవనాల పేర్లను మార్చేందుకు యోగి సర్కారు నడుంబిగించిందన్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన నగరపాలక సమావేశంలో సభ్యుల సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు. స్థానికతను ప్రతిబింబించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా పేర్లు పెట్టడం జరుగుతుందన్నారు.
నగరంలోని భోజుబీర్ మార్గానికి రాజర్షి ఉదయ్ ప్రతాప్ జూదేవ్, పాండేయ్పూర్-ఆజమ్గఢ్ రహదారికి మున్షీ ప్రేమ్చంద్ పేర్లు పెట్టేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. నగరంలోని పలు వార్డుల పేర్లు కూడా మారనున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..!