బెంగాల్‌లో ‘వక్ఫ్‌’ ఉద్రిక్తతలు | Murshidabad protest over Waqf Amendment Act turns violent | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ‘వక్ఫ్‌’ ఉద్రిక్తతలు

Apr 12 2025 6:25 AM | Updated on Apr 12 2025 6:25 AM

Murshidabad protest over Waqf Amendment Act turns violent

కోల్‌కతా: వివాదాస్పద వక్ఫ్‌ చట్టానికి నిరసనగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కొందరు నిమ్టియా స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలుపై రాళ్లతో దాడికి దిగారు. రైల్వే స్టేషన్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. కనీసం పది మంది పోలీసులు సైతం ఈ దాడిలో గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు బీఎస్‌ఎఫ్‌ను రంగంలోకి దించారు. 

ఘటన నేపథ్యంలో రెండు రైళ్లను రద్దు చేశామని, మరో ఐదు రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. రాళ్ల దాడిలో ప్రయాణికులు సైతం గాయపడ్డారని చెప్పారు. వక్ఫ్‌ చట్టాన్ని నిరసిస్తూ ముర్షిదాబాద్‌లో ఆందోళనకారులు నిరసనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో తలపడ్డారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. సుటి, సంసేర్‌గంజ్, జంగీపూర్‌లలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగిన వారిని చెదరగొట్టామన్నారు. 

జాతీయ రహదారిపై రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. కోల్‌కతాలోని అలియా వర్సిటీ విద్యార్థులు వక్ఫ్‌ చట్టంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. కాగా, ముర్షిదాబాద్, నార్త్‌ 24 పరగణాల జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులపై గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ స్పందించారు. హింసకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. హోం మంత్రి అమిత్‌ షాకు పరిస్థితులను వివరించారు. సీఎం మమత ఈ నెల 16న కోల్‌కతాలో ఇమామ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ చెప్పారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో మంగళవారం కూడా ఆందోళనల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement