పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్‌ | Mumbai Ferry Sink Incident News Latest Updates | Sakshi
Sakshi News home page

పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్‌

Dec 18 2024 5:49 PM | Updated on Dec 19 2024 4:49 AM

Mumbai Ferry Sink Incident News Latest Updates

13 మంది జలసమాధి

ముంబై సమీపంలో దుర్ఘటన

మృతుల్లో ముగ్గురు నేవీ అధికారులు

ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్‌కమల్‌’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్‌ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ  మునిగిపోయింది. 

తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్‌ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్‌ పోలీస్‌ బోట్‌లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్‌ కొత్త ఇంజన్‌ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్‌ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్‌కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్‌ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చెప్పారు.

VIDEO CREDITS: NDTV Marathi 

Advertisement
 
Advertisement
Advertisement