
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (శనివారం) ఉదయాన్నే పలు పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, ఇతర అత్యవసర సంస్థలు తనిఖీలు ప్రారంభించాయని ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి ఒకరు తెలిపారు. ఉదయం 6:35 నుండి 7:48 గంటల మధ్యలో ఈ బాంబు బెదిరింపులకు సంబంధించిన కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.
బాంబు బెదిరిపుల కాల్స్ వచ్చిన పాఠశాలల్లో ఆంధ్రా స్కూల్, బీసీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, రావు మాన్ సింగ్ స్కూల్, కాన్వెంట్ స్కూల్, మాక్స్ ఫోర్ట్ స్కూల్ ద్వారకలోని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పోలీసు బృందాలు ఆయా పాఠశాలల్లో పరిశీలనలు జరుపుతున్నాయి. పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడమనేది గత నాలుగు రోజుల్లో ఇది మూడవ సంఘటన. గత సోమవారం ఢిల్లీ అంతటా 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. తరువాత అవి ఫేక్ అని తేలింది. అలాగే బుధవారం దాదాపు 50 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు జరిపిన పోలీసులు వాటిని ఫేక్ అని తేల్చారు.