మోదీ ‘రికార్డ్’పై కాంగ్రెస్ విమర్శ
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన ఘనతపై బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీ సాధించింది మైలురాయి కాదని, ఆయన ఈ దేశం మెడకు చుట్టుకున్న గుదిబండ అంటూ విరుచుకుపడింది. ‘సుదీర్ఘకాల ప్రధాని అంటూ ఒక్కరే ఉంటారు. ఎన్నికల ద్వారా, ఎన్నికలు కాకుండా అంటూ రెండు రకాల నిర్వచనాలు ఉండవు.
కానీ స్వీయ ప్రకటిత, కొత్తగా సృష్టించిన ‘సుదీర్ఘకాలం పాలించిన ప్రధాని’ అనే మైలురాయిని మోదీ మెడకు తగిలించుకున్నారు. అది మైలురాయికాదు దేశం మెడకు చుట్టుకున్న మోయలేని గుదిబండ’’ అని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జై రామ్ రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్చేశాశారు.
‘‘1947 ఆగస్ట్ 15న స్వతంత్రభారతంలోని దిగ్గజ నేతల సమ్మతితో, నాడు కొలువుదీరిన కేబినెట్కు సారథ్యం వహిస్తూ జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానిగా సేవలు ఆరంభించారు.
1947 నుంచి 1952 దాకా ప్రధానిగా నెహ్రూ హయాంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది. అంతటికీలక సమయం లెక్కలోకి రాదన్నట్లు నేడు మోదీ వ్యవహరిస్తూ చరిత్రను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. 1952 తర్వాత పాలనే నెహ్రూ ప్రధానిగా లెక్కలోకి వస్తుందని మోదీ కొత్త భాష్యం చెబుతున్నారు. ఇది ఆయన సంకుచిత ఆలోచనకు ప్రబల నిదర్శనం’’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట మసకబారింది’’ అని జైరాం ఆరోపించారు.
నెహ్రూతో మోదీని పోల్చలేం: పవార్
మోదీకి సరితూగగల నేత ఎవరూ లేరు అని బీజేపీ చెప్పుకోవడాన్ని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ చీఫ్ శరద్ పవార్ తప్పుబట్టారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో మోదీని పోల్చడం సరికాదని ఆయన తెలిపారు. నెహ్రూ దేశానికి అందించిన అద్వితీయమైన సేవలను ఎన్నటికీ మర్చిపోజాలమని పేర్కొన్నారు. ‘నెహ్రూను మరెవరితోనూ పోల్చలేం. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఎన్నో ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు’అని పేర్కొన్నారు.


