భర్తలకు స్పాట్‌.. రాజాలా బలవుతున్న భర్తలెందరో! | Meghalaya Honeymoon Case: Serial Incidents Fear Among Indian Men | Sakshi
Sakshi News home page

భర్తలకు స్పాట్‌.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!

Jun 9 2025 5:31 PM | Updated on Jun 9 2025 6:22 PM

Meghalaya Honeymoon Case: Serial Incidents Fear Among Indian Men

‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్‌ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్‌ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్‌ వినిపించింది. ‘‘అరేయ్‌.. మేఘాలయా హనీమూన్‌ కోసం వెళ్లిన జంట మిస్‌ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్‌ తినడం ఇవతల రవి వంతైంది.    

మేఘాలయా హనీమూన్‌ జంట మిస్టరీ మిస్సింగ్‌ ఎపిసోడ్‌లో బయటపడ్డ ట్విస్ట్‌ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్‌ మీడియా వేదికగా..!.  మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్‌ వేయడం.. హనీమూన్‌లోనే భర్తకు స్పాట్‌ పెట్టడం..  ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్‌ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. 



సిమెంట్‌ డ్రమ్ము అంటేనే.. 
ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్‌ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్‌ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్‌ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి,  ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్‌తో ముంచేశారు. 

ఆపై.. సౌరభ్‌ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్‌ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్‌ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్‌ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్‌ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్‌, షాహిల్‌ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్‌ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్‌ ఆపై.. 
రవీనా ఓ యూట్యూబర్‌. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్‌ మీడియాలో సురేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్‌ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. 

ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్‌పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. 



భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. 
నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. 

మీరట్‌ అక్బర్‌పూర్‌ సదాత్‌ గ్రామానికి చెందిన అమిత్‌(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్‌జీత్‌ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్‌.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్‌ గీసింది. ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.

పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. 
మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్‌తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్‌ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. 

రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్‌ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్‌ కుష్వాహ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి  సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. 

అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని  వాళ్లు మట్టుపెట్టారు.  విచారణలో  ఈ షాకింగ్‌  విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్‌ వెళ్లే ముందు ‌రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్‌ టికెట్స్‌ బుక్‌ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. 

ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement