ఆ అనామక పార్టీకి పడ్డవే వెయ్యి ఓట్లు! | Meet NCPI: The Obscure Party Behind the Trinamool Rebellion | Sakshi
Sakshi News home page

ఆ అనామక పార్టీకి మొత్తం పడ్డవే వెయ్యి ఓట్లు!

Jun 15 2026 7:31 AM | Updated on Jun 15 2026 7:49 AM

Meet NCPI: The Obscure Party Behind the Trinamool Rebellion

తృణమూల్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు మమతా బెనర్జీకి షాక్‌ ఇస్తూ వేరు కుంపటి ప్రకటించారు. నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా.. జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా, ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఎన్‌సీపీఐ ఒక్కసారిగా వార్తల్లోకి రావడంతో.. అసలు ఈ పార్టీ ఎవరిది? ఎక్కడిది? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం.. నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) 2023 జనవరి 20న రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీగా నమోదైంది. అక్కడి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన శాంతను డే తెలిపారు. అయితే పార్టీ ప్రధాన కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్‌లో ఉండడం గమనార్హం. 

త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీఐ పోటీ చేసింది. ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావించినప్పటికీ, నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరకు రెండు స్థానాల్లో మాత్రమే పార్టీ గుర్తుపై అభ్యర్థులు బరిలో నిలిచారు. చౌమనులో పార్టీ అభ్యర్థి 536 ఓట్లు సాధించగా, కైలాశహర్‌లో 286 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం కలిపి 822 ఓట్లకే పరిమితమైంది. మరో అభ్యర్థి స్వతంత్రుడిగా పోటీ చేసి 376 ఓట్లు సాధించాడు. మొత్తంగా పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కలిపి 1,198 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఎన్నికల తర్వాత పార్టీ పూర్తిగా కనుమరుగైందని అప్పటి అభ్యర్థులే చెబుతున్నారు.

కైలాశహర్‌ అభ్యర్థి జహంగీర్‌ అలీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కోల్‌కతా నుంచి వచ్చిన షెవ్లీ కుండు తమను సంప్రదించారని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ కార్యాచరణ పూర్తిగా ఆగిపోయిందని తెలిపారు. మరో అభ్యర్థి బర్జెడా త్రిపుర కూడా పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ, ఎన్నికల తర్వాత నాయకత్వంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వెల్లడించారు. త్రిపుర ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గతంగా ఆర్థిక వ్యవహారాలపై విభేదాలు తలెత్తాయని శాంతను డే తెలిపారు. 2023 పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. 2026 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ప్రయత్నించినా, ఆర్థిక వనరుల కొరత కారణంగా ముందుకు సాగలేకపోయినట్లు చెప్పారు.

పార్టీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. ఎన్నికల సంఘం వద్ద నమోదైన విరాళాల మొత్తం కేవలం రూ.1.13 లక్షలు మాత్రమే. పార్టీ ఖజాంచీ(ట్రెజరర్‌.. కోశాధికారి)గా షెవ్లీ కుండు పేరు నమోదైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆమె అదే చిరునామాలో నమోదైన రెండు సంస్థలకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. వాటిలో ఒకటి బిశ్వబజార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాగా, మరొకటి పశ్చిమ బంగా అసంఘటిత మహిళా కర్మి అసోసియేషన్‌. ఈ రెండు సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని బనిపూర్‌ ప్రాంతంలోనే నమోదయ్యాయి. ఇదే అడ్రస్‌ ఎన్‌సీపీఐ పార్టీ అధికారిక కార్యాలయంగా కూడా ఉంది.

ఉత్తియా కుండు అనే వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా(ఇప్పటికీ) వ్యవహరిస్తున్నారు. ఆయన షెవ్లీ కుండు భర్త. రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేని ఈ అనామక పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన దాదాపు రెండొంతుల మంది లోక్‌సభ ఎంపీలు ఈ పార్టీతో చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం సాయంత్రం.. తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని కోరారు. అనంతరం ఎంపీ కాకోలీ ఘోష్‌ దస్తిదార్‌ తమ వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అధికారికంగా లేఖ సమర్పించినట్లు తెలిపారు. మరోవైపు తృణమూల్‌ సీనియర్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ్‌ కూడా తిరుగుబాటు ఎంపీలు ఎన్‌సీపీఐలో విలీనమయ్యారని ధృవీకరించారు. దీంతో ఇప్పటివరకు త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ చిన్న పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థితికి చేరుకుంది.

అయితే, ఈ విలీనం అంత సులభంగా చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పదో షెడ్యూల్‌ (యాంటీ డిఫెక్షన్‌ చట్టం) ప్రకారం.. పార్లమెంటులోని ఒక పార్టీకి చెందిన ఎంపీలు వేరే పార్టీతో విలీనం కావాలంటే, ఆ పార్టీ పార్లమెంటరీ విభాగంలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు విలీనానికి అంగీకరించాలి. తిరుగుబాటు ఎంపీలు తమ సంఖ్య ఆ పరిమితిని దాటిందని చెబుతున్నప్పటికీ, దీనిపై తుది నిర్ణయం లోక్‌సభ స్పీకర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక సమూహంగా గుర్తిస్తారా? ఎన్‌సీపీఐలో విలీనాన్ని అధికారికంగా ఆమోదిస్తారా? అనే అంశాలపై స్పీకర్‌ నిర్ణయం కీలకంగా మారనుంది. అందువల్ల తృణమూల్‌లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగినప్పటికీ, ఈ విలీనం చట్టపరంగా, పార్లమెంటరీ పరంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement