ఢిల్లీ: భారతీయులపై అమెరికా జాత్యాహంకార వ్యాఖ్యల పట్ల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ప్రతి దేశంలోనూ కొంతమంది మూర్ఖులు ఉంటారని వారిని పరిగణలోకి తీసుకోకూడదన్నారు. వారు అమెరికాకు ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఒక జర్నలిస్టు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనల గురించి రూబియోను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలోనూ ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో అన్నారు.
అమెరికాలో భారతీయులపై కొంతమంది చూపే జాత్యహంకారాన్ని మొత్తం అమెరికన్ సమాజపు గుర్తింపుగా అభివర్ణించడం తప్పు అవుతుందని రూబియో స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన తోడ్పాటు అందించారని కొనియాడారు. ప్రత్యేకంగా భారతీయ సమాజాన్ని ప్రశంసించారు. వ్యాపారం, సాంకేతికత, వైద్యం, ప్రజా సేవలతో సహా అనేక కీలక రంగాలలో భారతీయ-అమెరికన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 20 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందిస్తున్నారని ఈ సంఖ్య మరింత పెరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.
భారత్, అమెరికా మధ్య సంబంధం కేవలం సహకారానికే పరిమితం కాదని, అది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇరు దేశాలు కలిసి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. భారత్, అమెరికా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని మార్కోరూబియో ప్రశంసించారు.


