మావోయిస్టుల బంకర్‌ స్వాధీనం.. కొత్త టెక్నాలజీతో బాంబుల తయారీ! | Maoist Bunker Seized By Armed Forces At Chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల బంకర్‌ స్వాధీనం.. కొత్త టెక్నాలజీతో బాంబుల తయారీ!

Jan 18 2025 7:13 AM | Updated on Jan 18 2025 11:13 AM

Maoist Bunker Seized By Armed Forces At Chhattisgarh

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలోనే తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్‌ను జవాన్లు గుర్తించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామ్రాగిని స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్‌ను డీఆర్జీ జవాన్లు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సైనికులకు హాని కలిగించే విధంగా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు నక్సలైట్లు గాజు సీసాలు ఉపయోగిస్తున్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. ఆయుధాలు తయారు చేసే యంత్రాలు, ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను గుర్తించారు.

బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నట్టు తెలిపారు. దీంతో, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేతలు కూడా ఉన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement