మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి మహిళా మావోయిస్టు నాయకురాలు రూపి మరణించారు. మరికొంత మంది మావోయిస్టులు అడవిలోనే ఉన్నట్లు సమాచారం అందడంతో కుంబింగ్ సాగుతోంది.
కంకేర్ జిల్లాలోని ఛోటేబేఠియా-పర్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్పల్లి-ఆరంఝోరా-హిదుర్ అడవి ప్రాంతంలో మావోయిస్టులున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏరియా కమిటీ మెంబర్ రూపి మృతిచెందారు. ఘటనా స్థలం నుండి రూపితో పాటు ఒక పిస్టల్, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా కంకేర్ అడవుల్లో మరో 10 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందిందని వారికోసం గాలింపులు చేపడుతున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అయితే మావోయిస్టు పార్టీ దాదాపు అంతర్ధాన దశకు చేరుకుంది. ఇదివరకే మావోయిస్టు అగ్రనాయకత్వం పోలీసుల ఎదుట లొంగిపోయింది. మరికొంతమంది ఎన్కౌంటర్లలో మృతిచెందారు.
కేంద్ర మంత్రి అమిత్షా మావోయిస్టు పార్టీని అంతం చేస్తానని ప్రకటించడంతో వారిపై దాడులు తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది.


