
బెంగాల్లో ‘వక్ఫ్’ వ్యతిరేక ఆందోళనల్లో కేంద్రం పాత్ర
తీవ్ర ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ
అమిత్షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్
కోల్కతా: వివాదాస్పద వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో కొనసాగిన ఘర్షణలు, హింసాత్మక ఘటనల వెనుక కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు భద్రతా బలగం(బీఎస్ఎఫ్), నిఘా వర్గాల హస్తముందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం కోల్కతాలో ముస్లిం మతాధికారులతో సమావేశం సందర్భంగా మమత మాట్లాడారు.
‘‘ అరాచక, సమాఖ్య వ్యతిరేక వక్ఫ్(సవరణ) చట్టాన్ని ప్రధాని మోదీ అమలుచేయొద్దు. దీని అమలు కొనసాగితే అది దేశాన్ని ముక్కలుచేస్తుంది. సొంత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి తప్పించాలి. ఓవైపు బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు రాజ్యమేలుతుంటే బీజేపీ సర్కార్ హడావుడిగా వక్ఫ్ చట్టం తెచ్చింది. బెంగాల్లో హింసకు కేంద్ర హోం శాఖ పథకరచన చేసింది. ఈ కుట్రలో బీఎస్ఎఫ్ పాత్రపై విచారణ జరిపించాలి. సరిహద్దును పరిరక్షించాల్సిన బాధ్యత బీఎస్ఎఫ్ది కాదా?.
అంతర్జాతీయ సరిహద్దును మా(టీఎంసీ) ప్రభుత్వం పరిరక్షించదు. ఈ విషయంలో కేంద్రం తన బాధ్యతలను విస్మరించకూడదు. బెంగాల్ అల్లర్లలో మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తున్నా. సరిహద్దు దాటి బెంగాల్లోకి బంగ్లాదేశీయులు చొరబడుతుంటే నిర్లక్ష్యంగా ఉన్న బీఎస్ఎఫ్ వైఖరిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నా’’ అని మమత అన్నారు. ‘‘అమిత్ షా ఎన్నటికీ ప్రధాని కాలేరు. మోదీజీ ప్రధాని పీఠం నుంచి దిగిపోయాక అమిత్ షా ఏం చేస్తారు?. కేంద్ర నిఘా సంస్థలను అమిత్ షా దుర్వినియోగం చేస్తున్నారు. అమిత్ షా కార్యకలాపాలపై మోదీ ఓ కన్నేసి ఉంచాలి. మోదీ అమిత్కు అడ్డుకట్టవేయాల్సిందే’’ అని మమత అభ్యర్థించారు.
స్థానిక కాంగ్రెస్ నిర్లక్ష్యమూ దాగి ఉంది
ఘర్షణల వెనుక టీఎంసీ ఉందన్న ఆరోపణలను మమత ఖండించారు. ‘‘ ఘర్షణలు జరిగిన ధులియాన్, షంషేర్గంజ్లు మాల్డా దక్షిణ్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్ నేత ఇషా ఖాన్ చౌదరి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉంది. ఈ ఘర్షణల వెనుక నిజంగా టీఎంసీ ఉంటే మా ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు ఎందుకు దాడులు చేస్తారు?. మా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? అని మమత ఎదురు ప్రశ్నించారు. ముస్లిం మతాధికారులు వక్ఫ్ అంశంలో నేరుగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలను కలిసి తమ ఆందోళనను తెలియజేయాలి. వక్ఫ్కు వ్యతిరేకంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి తుదికంటా పోరాడుతుంది’’ అని అన్నారు.
ఆయన యోగి కాదు భోగి
తనపై విమర్శలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై మమత ప్రతివిమర్శలు చేశారు. ‘‘యోగి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన యోగి కాదు పెద్ద భోగి. మహాకుంభమేళాలో తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?. మీ రాష్ట్రంలో పోలీస్ ఎన్కౌంటర్లలో ఎంత మందిని చంపేశారు?. రాష్ట్రంలో శాంతియుత ర్యాలీలను కూడా యోగి అనుమతించట్లేదు. బెంగాల్లో మాత్రం ప్రజలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు’’ అని అన్నారు. హిందువులను బాధితులుగా మారుస్తున్న మమత సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ విమర్శించింది.