భారత్‌కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా? | Maldivian Foreign Minister Moosa Zameer Will visit India | Sakshi
Sakshi News home page

భారత్‌కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా?

May 8 2024 9:38 AM | Updated on May 8 2024 11:02 AM

Maldivian Foreign Minister Moosa Zameer Will visit India

ఢిల్లీ: భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా విబేధాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వివరాల ప్రకారం.. గురువారం(మే 9వ తేదీన) భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మూసా జమీర్‌ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్‌, మాల్దీవుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అందిస్తుందని  భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.

ఇక, మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మే 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేశారు.

ఇదిలా ఉండగా.. మాల్దీవులకు మయిజ్జు అధ్యక్షుడైన తర్వాత భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్‌ కంట్రీ చైనాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా మాల్దీవులకు కౌంటరిచ్చే విధంగా లక్షద్వీప్‌కు సపోర్టు చేశారు. దీంతో, మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపించింది.

Advertisement
 
Advertisement
Advertisement