
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది.
ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి