
ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో పెరిగిన మరణాలు
11 ఏళ్ల తర్వాత తొలిసారి 3,080 మంది మరణించినట్లు ఎన్వీస్టాట్స్ నివేదిక వెల్లడి
ఏపీలో 56మంది మృతి
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం.
సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది.
నివేదికలో అంశాలివీ..
⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి.
⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి.
⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది.
⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది.