‘ద్రోహి’వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టులో కునాల్‌ కమ్రా క్వాష్‌ పిటిషన్‌ | Kunal Kamra moves Bombay High Court to quash FIR over Shinde joke row | Sakshi
Sakshi News home page

‘ద్రోహి’వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టులో కునాల్‌ కమ్రా క్వాష్‌ పిటిషన్‌

Apr 7 2025 9:51 AM | Updated on Apr 7 2025 10:16 AM

Kunal Kamra moves Bombay High Court to quash FIR over Shinde joke row

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై (Eknath Shinde) నోరు పారేసుకున్న స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ (quash petition) దాఖలు చేశారు.  

‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్‌  కమ్రా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ‘గద్దార్‌’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెల‌రేగింది. డిప్యూటీ సీఎంపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ శివ‌సేన ఎమ్మెల్యే ముర్జీ ప‌టేల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ముర్జీ ప‌టేల్ ఫిర్యాదు మేర‌కు కునాల్ క‌మ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమ వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అతడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్లు చేశారు.

అయితే, ఈ త‌రుణంలో ఇవాళ  శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరారు.

అంత‌కుముందు, తాను చేసిన వ్యాఖ్య‌లపై అంతేకాదు చ‌ట్ట బ‌ద్ధంగా త‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా స‌హ‌కరించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 27న మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

న్యాయ స్థానం బెయిల్ ఇచ్చిన త‌ర్వాత ఏప్రిల్ 1న న‌మోదైన మూడు ఎఫ్ఐఆర్‌ల‌పై ఖార్ పోలీస్‌స్టేష‌న్‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని  కునాల్‌ కమ్రాను పోలీసులు కోరారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కమ్రా బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement