ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ కాలంలో 15 సిట్టింగ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సమావేశాలు ఎటువంటి అంతరాయం లేకుండా జరగాలని భావించిన కేంద్రం.. నవంబర్ 30న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగే ఈ భేటీలో.. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై, చర్చకు వచ్చే ముఖ్య అంశాలపై, విపక్షాల సహకారం అవసరంపై చర్చించనుంది. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అందుకు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని పార్లమెంట్లో బలంగా లేవనెత్తి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.


