
బెంగళూరు: కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం బెళగావి వద్ద ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టంకొద్దీ గాయాలతోనే ఆమె బయటపడ్డారు.
మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్(Lakshmi Hebbalkar) ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలవగా.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఆమె ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్(Chennaraj) తలకు గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్ వెల్లడించారు. ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ చెబుతున్నారు. లక్ష్మి హెబ్బాళ్కర్ 2023, 2018 ఎన్నికల్లో బెళగావి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు.