
అత్యాచారం కేసులో బెయిలు ఇవ్వలేం: హైకోర్టు
కర్ణాటక: యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి హైకోర్టు బెయిలును నిరాకరించింది. వివరాలు.. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాకు చెందిన సయ్యద్ పర్వేజ్ నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న బిహార్ కూలీ యువతి (19) కేరళ నుంచి సొంతూరికి వెళ్లాలని బయల్దేరింది. బెంగళూరు కేఆర్ పురం రైల్వేస్టేషన్లో దిగింది. మరుసటి రోజు అర్ధరాత్రి యువతి తెలిసిన వ్యక్తితో భోజనం చేయాలని హోటల్కు నడుచుకుంటూ వెళ్తోంది.
ఈ సమయంలో అక్కడే ఉన్న నిందితుడు పర్వేజ్, మరొక నిందితుడు వారిపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పరప్పన జైలుకు తరలించారు. బెయిలు ఇవ్వాలని నిందితుడు పర్వేజ్ హైకోర్టును ఆశ్రయించాడు. మహిళలను గౌరవించాలని మన పురాణాలు ఘోషిస్తున్నాయి, అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా నడిచి వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు మహాత్మాగాంధీ చెప్పారు, ఈ నేరంలో బెయిలు ఇవ్వలేము అని జడ్జి ఎస్.రాచయ్య తీర్పు చెప్పారు.