న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో ఎంపీ రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడిన విషయం తెలిసిందే. లోక్ కల్యాణ్ మార్గ్కు చేరుకుని రాహుల్ గాంధీతో ఆయన చర్చించారు. ఆ సమయంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడే ఉన్నారు.
దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ... "కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయనతో పాటు ఉన్న సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు తమ మద్దతుదారులతో కలిసి అక్బర్ రోడ్ సమీపంలో ఒక్కసారిగా ధర్నాకు కూర్చున్నట్టు తెలిసింది.
ఈ సీనియర్ ప్రతినిధి బృందానికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారితో చర్చించేందుకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి నన్ను ప్రభుత్వం స్వయంగా అక్కడికి పంపింది. ఆ ప్రదేశం ధర్నాలకు అనువైనది కాదని, అక్కడ ధర్నా చేయడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెబుతూ, ధర్నాను విరమించాలని రాహుల్ గాంధీని కోరాం.
ప్రభుత్వం నీట్కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు అంగీకరిస్తే తాను వెంటనే ధర్నా విరమిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. కొన్ని క్షణాల్లోనే ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం అనుమతి తీసుకున్న తర్వాత, ఆయన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని, నీట్కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చాం.
ఈ సమాచారం రాహుల్ గాంధీకి తెలియజేయగానే, దీనికే తాను అంగీకరించనని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని హామీ ఇవ్వాలని కూడా కోరారు. ఇప్పుడు తనకు రెండు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి పార్లమెంట్లో చర్చ, రెండోది కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అని చెప్పారు.
ఇంతకుముందు చర్చ మాత్రమే కోరారని గుర్తు చేయగా, ఇప్పుడు తన డిమాండ్లు మారాయని చెప్పారు. ఇంత త్వరగా మాట మార్చడం తనలాంటి సీనియర్ నేతకు తగదని వినయంగా వివరించే ప్రయత్నం చేయగా, అది తన ప్రత్యేక హక్కు అని చెప్పారు.
ఈ ప్రదేశం ధర్నాకు అనువైనది కాదని హోం కార్యదర్శి వివరించే ప్రయత్నం చేయగా, తాను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవడం కూడా తన ప్రత్యేక హక్కేనని సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ లాంటి సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు తన మాట నుంచి వెనక్కి తగ్గడం దురదృష్టకరం. అది ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధం.
నీట్కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి భిన్నంగా, ఈ తీవ్రమైన అంశంపై నిబంధనల ప్రకారం అధికారిక చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు" అని జితేంద్ర సింగ్ తెలిపారు.


