
పొరుగు దేశాలకు జైశంకర్ సూచన
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో సంబంధాలు ఎల్లప్పుడూ సజావుగా సాగాలని ఆశించకూడదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. పాలకులతో సంబంధం లేకుండా సంబంధాల్లో స్థిరత్వాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం ప్రయతి్నంచిందని నొక్కి చెప్పారు. అందుకు శ్రీలంక, మాల్దీవులను ఆయన ఉదహరించారు. అక్కడ నాయకత్వం మారినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. ఏ దేశంతోనైనా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు చేతులెత్తేయకూడదన్నారు.
భారత్తో కలిసి పనిచేయడం ఇతర దేశాలకే లాభిస్తుందని, లేదంటే వారే నష్టపోతారని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని గ్రహించడానికి కొన్ని దేశాలకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. సైన్యం చేతుల్లో అధికారం, భారత్పై శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఇందుకు మినహాయింపని, ఒక్క పాక్ను పక్కనపెడితే.. దౌత్యం అన్ని చోట్లా వర్తిస్తుందన్నారు. డీడీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ను తన ఎక్స్ హ్యాండిల్లో శనివారం రాత్రి ఆయన పోస్టు చేశారు.
దాదాపు గంటసేపు జరిగిన సంభాషణలో దౌత్యసంబంధాలపై అనేక విషయాలను జైశంకర్ పంచుకున్నారు. చైనాతో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి మన సామర్థ్యాలను పెంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జూన్ 2020లో గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. అయితే.. గత దశాబ్దాల్లో మన సరిహద్దు మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి వచ్చింన్నారు.
కానీ బీజేపీ ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాలపై నిర్మించడం వల్ల పరిస్థితి మారిపోయిందని, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతున్నామని జైశంకర్ తెలిపారు. గత 11 ఏళ్లలో భారత్ పొరుగు దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకుందని, గల్ఫ్ దేశాలకు చేరువైందని, ఆసియాన్, ఇండో–పసిఫిక్ ప్రాంతాలతో సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకుందని చెప్పారు.
మోదీ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్ పట్ల భారతదేశ విధానం మారిపోయిందని, 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్, 2019 బాలకోట్ వైమానిక దాడులను ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, భారత్ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విస్తృత వ్యూహంలో భాగాలుగా చూడాలని జైశంకర్ చెప్పారు. ప్రధాని మోదీని ‘మన కాలపు నాయకుడు’గా జైశంకర్ అభివరి్ణంచారు. ప్రజల మానసిక స్థితి మారిందని, ప్రజల ఆత్మవిశ్వాసానికి’ప్రధాని మోదీ నిదర్శనమని మంత్రి నొక్కి చెప్పారు.