
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(Indian Railways)లో విధులు నిర్వహిస్తున్న లోకో పైలట్లు తమకు డ్యూటీ సమయంలో భోజనం చేయడానికి, టాయిలెట్కు విరామ సమయం కావాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా లోకో పైలట్ల వినతిని రైల్వేశాఖ తిరస్కరించింది. దీంతో లోకో పైలట్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని బహుళ-విభాగాల కమిటీ సిఫార్సుల ఆధారంగా తీసుకుంది.
రైల్వే బోర్డుకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) సభ్యుల కమిటీ లోకో పైలట్లకు విరామం ఇవ్వాలనే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీ 2024, జూలైలో ఏర్పాటయ్యింది. లోకో పైలట్లు, గార్డుల ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది. కాగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్(All India Loco Running Staff Association) (ఏఐఎల్ఆర్ఎస్ఏ) సెక్రటరీ-జనరల్ కేసీ జేమ్స్, రైల్వే బోర్డు ఛైర్మన్/సీఈఓకు రాసిన ఒక లేఖలో ఈ కమిటీ రైలు వేగాన్ని 110 కిమీ/గం నుండి 130 కిమీ/గం వరకు పెంచిందని, ఫలితంగా లోకో పైలట్లపై పెరిగే ఒత్తిడి స్థాయిని అంచనా వేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. లోకోమోటివ్లలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం లోకో పైలట్లకు ఇబ్బందికరంగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం లోకో పైలట్ల ఆరోగ్యం, రైళ్ల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
కాగా రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ రైళ్ల షెడ్యూల్ను నిర్వహించడం, ఆలస్యాలను నివారించడం కోసం ఈ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది. లోకోమోటివ్లలో టాయిలెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదా డ్యూటీ సమయంలో విరామాలను అనుమతించడం వల్ల రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతుందని బోర్డు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఏఐఎల్ఆర్ఎస్ఏ తీవ్రంగా ఖండించింది. లోకో పైలట్ల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రైల్వేలో 41,000 మందికి పైగా లోకో పైలట్లు ఉన్నారు. వీరిలో 1,828 మంది మహిళా లోకో పైలట్లు.
ఇది కూడా చదవండి: Delhi: సీఎంకు ‘శీష్ మహల్’ అడ్డంకి.. దక్కని అధికార నివాసం