
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి సీఎంగా రేఖాగుప్తా(Rekha Gupta) భాధ్యతలు చేపట్టి, 50 రోజులు దాటినా ఆమెకు అధికార నివాసం దక్కలేదు. ప్రస్తుతం ఆమె షాలిమార్ బాగ్లోని తన ప్రైవేట్ నివాసంలోనే ఉంటున్నారు. దీనికి ‘శీష్ మహల్’ వివాదమే కారణమనే వాదన వినిపిస్తోంది. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివసించిన ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులోని విలాసవంతమైన భవనాన్ని బీజేపీ ‘శీష్ మహల్’(అద్దాల మేడ)గా అభివర్ణించింది. ఈ నేపథ్యంలోనే నూతన సీఎం రేఖా గుప్తా ఆ బంగ్లాలో నివసించడానికి నిరాకరించారు. దానిని మ్యూజియంగా మార్చాలని ఆమె ప్రతిపాదించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పదవిని చేపట్టాక తాను శీష్ మహల్(Sheesh Mahal)లో ఉండబోనని, అది ప్రజల సొమ్ము అని, దానిని వినియోగించే హక్కు తనకు లేదని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్ విలాసవంతమైన జీవనశైలి కోసం ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. మరోవైపు సీఎం రేఖా గుప్తాకు ప్రత్యామ్నాయ అధికారిక నివాసం కేటాయించడం ఢిల్లీ ప్రభుత్వానికి సవాల్గా మారింది. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు అధికారిక నివాసంగా మూడు బంగ్లాలను ఎంపిక చేసింది. సీఎం తన నివాసం కోసం వీటిలో ఒక బంగ్లాను ఎంపికచేసుకోవలసి ఉంటుంది.
ప్రస్తుతం సీఎం రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నివాసంలోనే ఉంటూ, ఢిల్లీ సెక్రటేరియట్ నుండి పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఈ పరిస్థితిని విమర్శిస్తూ, ‘బీజేపీ ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసింది. అయితే ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రికి నివాసం కూడా కేటాయించలేకపోతోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదాలకు అతీతంగా సీఎం రేఖా గుప్తా బీజేపీ ఎన్నికల హామీలైన మహిళా సమృద్ధి యోజన, యమునా నది శుద్ధీకరణ వంటి ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు.
ఇది కూడా చదవండి: 108 దేశాల్లో ‘నవకార్ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ