55 యాంటీ–డ్రోన్ గన్లతో నింగీ నేలా నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 3వ తేదీ నుంచి మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు మునుపెన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆపరేషన్ శివ పేరుతో సైన్యం ఈసారి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. యాత్రకు సరికొత్త టెక్నాలజీతో యాంటీ–డ్రోన్ వ్యవస్థతో భద్రతను కల్పించనుంది. సున్నితమైన 55 ప్రాంతాల్లో అత్యాధునిక యాంటీ–డ్రోన్ గన్లు, నిఘా పరికరాలను మోహరించారు.
దేశంలోనే మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఇలాంటి వ్యవస్థను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఎల్రక్టానిక్ వార్ఫేర్ పరికరాలు, ప్రత్యేక నిఘా వ్యవస్థలు శత్రు డ్రోన్లను గుర్తించి క్షణాల్లో నిరీ్వర్యం చేయగలవు. సుమారు 400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారి, బాల్తాల్, పహల్గామ్ మార్గాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.
ఆర్మీ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ స్వయంగా బాల్తాల్, సోన్మార్గ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కమాండోల మోహరింపు: యాత్ర మార్గంలో క్యూఆర్టీ, క్యూఈటీ, బాంబు నిరోధక దళాలు, డాగ్ స్క్వాడ్లు, మౌంటెన్ రెస్క్యూ టీమ్లను అందుబాటులో ఉంచారు. లఖన్పూర్ నుంచి పవిత్ర అమర్నాథ్ గుహ వరకు ఉన్న మార్గాన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించారు. సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున అదనంగా బలగాలను నియమించారు.


