పిలిస్తే ఎగిరొచ్చే 'డ్రోన్‌' | Drone-based policing system in Telangana | Sakshi
Sakshi News home page

పిలిస్తే ఎగిరొచ్చే 'డ్రోన్‌'

Aug 6 2026 4:16 AM | Updated on Aug 6 2026 4:16 AM

Drone-based policing system in Telangana

డ్రోన్‌ పనితీరును పరిశీలిస్తున్న డీజీపీ సీవీ ఆనంద్, టీజీ ఐసీసీసీ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి తదితరులు

24/7 ఆన్‌ డ్యూటీ

కాల్‌ చేస్తే తక్షణం బాధితుల వద్దకు డ్రోన్‌ 

రాష్ట్రంలో డ్రోన్‌ ఆధారిత పోలీసింగ్‌ వ్యవస్థ 

పైలట్‌ ప్రాజెక్టుగా గ్రేటర్‌ వ్యాప్తంగా అమలు 

వెల్లడించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌

‘డయల్‌–112 ’వ్యవస్థ ఆవిష్కరణ.. వేంసూరు నుంచి తొలి కాల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆపదలో ఉన్న ఎవరైనా...అది ఏ సమయంలోనైనా.. ‘డయల్‌–112’కు కాల్‌ చేస్తే తక్షణం బాధితుల వద్దకు ఓ డ్రోన్‌ వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఈ డ్రోన్‌ డిస్పాచ్‌ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామన్నారు. ఏఐ సహా వివిధ హంగులతో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ‘డయల్‌–112’వ్యవస్థను ఆనంద్‌ బుధవారం ఆవిష్కరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమానికి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి సీపీలు వీసీ సజ్జనర్, ఎం.రమేష్‌, బి.సుమతి తదితరులు హాజరయ్యారు.  

డ్రోన్‌ టీమ్‌ను ఎంపిక చేయనున్నాం: డీజీపీ సీవీ ఆనంద్‌
‘ప్రస్తుతం పండుగలు, బందోబస్తు కోసం అద్దెకు తెచ్చిన డ్రోన్లను వాడుతున్నాం. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా వినియోగానికి ఐదు సమీకరించుకున్నాం. రాజధానిలోని నాలుగు కమిషనరేట్లలో ఇవి వాడతాం. వీటి సంఖ్యను భారీగా పెంచి పోలీసుస్టేషన్‌ స్థాయికీ తీసుకువెళ్తాం. ఎవరైనా ఆపదలో ఉండి ఫోన్‌ చేస్తే ఐసీసీసీ నుంచే ఆ ఠాణా పైన ఉన్న డ్రోన్‌ను బాధితుడి వద్దకు పంపే టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నాం. ‘డయల్‌–112’వచ్చిన కాల్స్‌ వద్దకు డ్రోన్లను డిస్పాచ్‌ చేసే విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక డ్రోన్‌ టీమ్‌ను ఎంపిక చేయనున్నాం. కేసుల దర్యాప్తు, రికార్డుల రూపకల్పన సహా ఇతర అంశాల్లో ఏఐను విస్తృతంగా వినియోగిస్తున్నాం. దీని కోసం ఏర్పాటు చేసిన టీ–స్పార్క్‌ను మరికొన్ని రోజుల్లో ఆవిష్కరిస్తాం. ఈ వ్యవస్థను నేరాల నిరోధం కోసం ఎస్పీలు, సీపీలు వాడుకోవాలి’ అని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు.

ఫోన్‌ చేసిన వారి లోకేషన్‌ తెలుస్తుంది 
‘వన్‌ నేషన్‌ వన్‌ నెంబర్‌’విధానంలో ‘డయల్‌–112’పని చేస్తుంది. ఈ విధానంలో కాల్‌ చేసిన వ్యక్తి లోకేషన్‌ను 94 శాతం కచ్చితత్వంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎదుటి వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించకపోతే వాళ్ళకు ఓ ఎస్సెమ్మెస్‌ పంపడం ద్వారా ఇది సాధ్యం. ఇందులో ఇంటెలిజెంట్‌ కాల్‌ ఫిల్టరింగ్, ఏఐ బేస్ట్‌ కాల్‌ ట్రాన్స్‌ఫర్, వాయిస్‌ టు టెక్ట్స్‌ టెక్నాలజీ తదితరాలు ఉన్నాయి. అందుబాటులోకి వచ్చిన కాల్‌ ఫిల్టర్‌ వ్యవస్థ ద్వారా రోజువారీగా వచ్చే 14 లక్షల కాల్స్‌లో అవసరమైన 18 వేల కాల్స్‌నే స్వీకరిస్తున్నారు. వీటిలోనూ 350 నుంచి 500 వరకు మాత్రమే బాధితుల నుంచి వచ్చేవి. ప్రస్తుతం పోలీసు, ఫైర్, అంబులెన్స్‌ సేవల్ని అనుసంధానించాం. భవిష్యత్తులో అన్ని అత్యవసర సేవలు దీని పరిధిలోకే వస్తాయి. కొన్నాళ్ల వరకు ‘డయల్‌–100’కూడా పని చేస్తుంది.  
– వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఐసీసీసీ డైరెక్టర్‌ 

ప్రత్యేక ఆకర్షణగా ఎన్నారై, సీనియర్‌ సిటిజన్స్‌ డెస్క్‌లు 
‘డయల్‌–112’వ్యవస్థలో భాగంగా అందుబాటులోకి వస్తున్న ఎన్నారై, సీనియర్‌ సిటిజన్స్‌ డెస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడిన వాళ్లు ఎవరైనా ఇక్కడ ఉన్న తమ తల్లిదండ్రులు, కుటుంబీకుల భద్రతపై ఆందోళన కలిగినప్పుడు ఈ ఎన్నారై డెస్‌్కకు కాల్‌ చేడయం ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చు. అలాగే నగరంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకూ ఇలాంటి అవకాశం ఉంది. ఈ రెండు డెసు్కలు సమస్యల్ని బట్టి స్పందిస్తూ స్థానిక పోలీసుసులను వారి వద్దకు పంపిస్తారు.  

మరిన్ని విశేషాలు ఇలా.. 
అత్యాధునిక ‘డయల్‌–112’వ్యవస్థలో ఒకేసారి 960 కాల్స్‌ స్వీకరించే అవకాశం ఉంది. అనునిత్యం 600 స్వీకరిస్తూ...అత్యవసర సమయాల్లో సామర్థ్యాన్ని పూర్తి స్థాయికి పెంచుతారు.  
⇒ రాత్రి వేళల్లోనూ థర్మల్‌ వ్యూతో పని చేసే డ్రోన్లను తొలుత మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు, కీలక సభలు, సమావేశాల సమయంలో వాడనున్నారు.  
⇒ ఐసీసీసీతో పాటు జిల్లా, ఠాణాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ నుంచి డ్రోన్లను నిర్వహించే అవకాశం ఉంటుంది. నిమిషానికి కిలోమీటరు ప్రయాణించే సామర్థ్యం ఉన్న వీటి ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుని, అవసరమైన సిబ్బందిని మోహరిస్తారు. 
⇒ ‘డయల్‌–112’కు తొలి ఫోన్‌ కాల్‌ ఖమ్మం జిల్లా వేంసూరు నుంచి వచ్చింది. అక్కడి ఓ రైతు దాదాపు పది మంది మహిళలు తన పొలం వద్దకు వచ్చిన గొడవ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. రెండో కాల్‌గా ఐసీసీసీకి 40 మీటర్ల దూరంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వచ్చింది. ఈ రెండు కాల్స్‌ సిబ్బంది స్థానిక ఠాణాలకు బదిలీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement