ఏమిటీ సింధూ నదీ  జలాల ఒప్పందం? | India Puts Indus Waters Treaty With Pakistan On Hold After Terrorists Attack In Pahalgam, Know Special Story Inside | Sakshi
Sakshi News home page

Indus Water Treaty Suspended: ఏమిటీ సింధూ నదీ  జలాల ఒప్పందం?

Apr 24 2025 5:05 AM | Updated on Apr 24 2025 1:03 PM

India puts Indus Waters Treaty on hold, special story

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీజలాల అంశం చర్చనీయాంశమైంది. 

ఘర్షణతో మొదలై ఒప్పందం దాకా..
ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్‌ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్‌ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్‌ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్‌ నదులపై భారత్‌కు హక్కులు దఖలుపడ్డాయి.

 సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్‌ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్‌ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలనూ పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు.

 ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్‌ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్‌లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నీటిబాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడచిన ఆరు దశబ్దాల్లో ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై భారత్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీజలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీజలాల ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్‌ వాదిస్తోంది. 

భారత్, పాక్‌ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్‌ ప్రపంచబ్యాంక్‌ దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్‌ వైదొలిగితే ఇకపై కేంద్రప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్‌ నదీజలాలు పాకిస్తాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాదిదేశాన్ని జలసంక్షోభం చుట్టుముడుతుంది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ . 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement