
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది.
‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంతప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు ఇండియాకూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్కు కూడా వర్తిస్తుంది’అని జర్మనీ కేజ్రీవాల్ అరెస్టుపై వివాదాస్పద ప్రకటన చేసింది. ఇదే కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చ్ 21న అరెస్టు చేసింది. కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు. 26న ప్రధాని మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది.