ఆ బూత్‌లో 9 గంటలకే 100 శాతం పోలింగ్‌! | Hundred Percent Voting in Sherdand | Sakshi
Sakshi News home page

ఆ బూత్‌లో 9 గంటలకే 100 శాతం పోలింగ్‌!

May 7 2024 1:18 PM | Updated on May 7 2024 1:18 PM

Hundred Percent Voting in Sherdand

ఈరోజు (మంగళవారం) దేశంలో లోకసభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్‌ బూత్‌లో ఉదయం 9 గంటలకే వందశాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పోలింగ్‌ కేంద్రం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.

వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని షెర్దాండ్‌‌ పోలింగ్ స్టేషన్ నంబర్ 143లో మొత్తం ఐదుగురు ఓటర్లు తమ ఓటు వేశారు. దీంతో ఇక్కడ 100 శాతం  పోలింగ్‌ పూర్తయ్యింది. ఎంపీని ఎన్నుకునేందుకు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

షెర్దాండ్‌ పోలింగ్ కేంద్రం కొరియా జిల్లాలోని సోన్‌హట్ జన్‌పాడ్ పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. ఐదుగురు ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఉదయం 9కే 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే, సీఈవో డాక్టర్ అశుతోష్ చతుర్వేది, అదనపు కలెక్టర్ అరుణ్ మార్కం, ఎస్డీఎం రాకేష్ సాహు తదితర జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే కృతజ్ఞతలు తెలిపారు.

వనాంచల్ ప్రాంతంలోని షెర్దాండ్‌లో మొత్తం ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు. ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడికి చేరుకోవడానికి పక్కా రోడ్లు లేవు. గ్రామపంచాయతీ చందా నుంచి పోలింగ్ పార్టీలు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement