
జిల్లాలో విపరీతంగా గుండెపోట్లు
యువతీ యువకుల హఠాన్మరణాలు
వైద్య ఆరోగ్యశాఖ విచారణ షురూ
హాసన్ జిల్లా అనగానే పశ్చిమ కనుమలకు ప్రవేశ ద్వారంగా, ప్రకృతి అందాలకు, వ్యవసాయానికి చిరునామాగా గుర్తుకొస్తుంది. కానీ ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందోననే దిగులు అక్కడ రాజ్యమేలుతోంది. గుండెపోట్ల భయం హాసన్ను పట్టిపీడిస్తోంది.
యశవంతపుర: తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్న నాటి నుంచి 60, 70 ఏళ్ల వరకు మోటారు పంపులా పనిచేసే గుండె త్వరగా అలసిపోతోంది. కరోనా వైరస్ విపత్తు వచ్చాక గుండె లయ తప్పుతోందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. రాష్ట్రంలో హాసన్ జిల్లాలో నెల రోజుల్లో 13 మంది గుండెపోటుతో కన్నుమూయడం ఆందోళనకరంగా మారింది. హాసన్కు చెందిన రాజారాం ఆనే వ్యక్తి సీఎం సిద్ధరామయ్య కు ఈ జాఢ్యంపై లేఖ రాసి విచారణ చేయాలని మనవి చేశారు.
4 నెలల్లో 250 మంది..
ఈ నేపథ్యంలో యువకుల్లో గుండెపోటు గురించి 10 మంది వైద్యుల బృందం విచారణ చేసింది. 18 నుంచి 45 ఏళ్ల లోపువారు ఎందుకు చనిపోయారు అనేది అధ్యయనం చేశారు. దీంతో పాటు జిల్లాలో గత నాలుగు నెలల వ్యవధిలో 250 మంది గుండెపోటు, ఆకస్మికంగా మరణాలకు గురయ్యారు. కరోనా వైరస్ టీకా కారణమని కొందరు ఆరోపించారు. వైద్యుల బృందం విచారణలో టీకా సంబంధం లేదని నిర్ధారించారు.
ఇతరత్రా కారణాలు
యువతీ యువకులకు వివిధ కారణాలతో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి సమాచారం క్రోడీకరించారు. కొందరు అధిక ధూమపానం, మద్యపానం, గుట్కా సేవించడం వల్ల ఇతరత్రా వ్యాధులు సోకి గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. అయితే ఇటువంటి అలవాట్లు లేని యువతులు, మహిళలు కూడా చాలామంది చనిపోయారు. తమ నిర్ధారణలతో వైద్యుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.
ఒకే నెలలో 13 మంది బలి
ఇటీవల హాసన్ నగరంలోని సత్యమంగల లేఔట్కు చెందిన చేతన్ (25), బేలూరు పట్టణవాసి నిషాద్ అహ్మద్ (35), మే 28 హొళెనరసిపుర పట్టణంలో సంధ్య (20), అరకలగూడు తాలూకా కోణనూరువాసి అభిõÙక్ (19), అదే రోజు హాసన్ తాలూకా కెలవత్తి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియ్ యువతి కవన (20), జూన్ 11న హొళెనరసీపుర పట్టణవాసి నిశాంత్ (20)లు ఆకస్మికంగా మరణించారు. జూన్ 12న ఆలూరు తాలూకా మగ్గె గ్రామం వద్ద బస్సులో ప్రయాణిస్తున్న రవాణా శాఖ ఉద్యోగి బీఆర్ నాగప్ప(55), హాసన్ మాజీ నగరసభ సభ్యుడు నీలకంఠప్ప(58), జూన్ 13న హాసన్ వద్ద రాజఘట్ట లో కారులో వెళ్తూనే దేవరాజ్ (43) చనిపోయారు. అలాగే హాసన్ నగరం తెలుగువారి వీధికి చెందిన సతీశ్ (57), జూన్ 14న హాసన్ తాలూకా దొడ్డపురవాసి కాంతరాజు (51) గుండెపోటుతో మృతి చెందారు.