కాంగ్రెస్‌లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్‌  | Gujarat And Himachal Pradesh Assembly Election Results Are Bitter For Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్‌ 

Dec 9 2022 2:56 AM | Updated on Dec 9 2022 8:14 AM

Gujarat And Himachal Pradesh Assembly Election Results Are Bitter For Congress - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు భరించలేని చేదును, కాస్త తీపిని రుచి చూపాయి. గుజరాత్‌లో బీజేపీ దెబ్బకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని చవిచూడ్సాలి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో గెలిచినా దాన్ని కాంగ్రెస్‌ ఘనత అనేకంటే బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. ఆ లెక్కన తాజా ఫలితాలు రెండూ కాంగ్రెస్‌కు ప్రమాద ఘంటికలే.

దీనికి తోడు ఆమ్‌ ఆద్మీ పార్టీ క్రమంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తూ పక్కలో బల్లెంలా మారుతున్న వైనం హస్తం పార్టీని మరింతగా కలవరపెట్టేదే. కాంగ్రెస్‌ ఇంతకాలం ప్రధానంగా బీజేపీతోనే తలపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్‌ మారుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడానికి ముందుగా ఆప్‌తోనే కాంగ్రెస్‌ తలపడాల్సిన పరిస్థితి తలెత్తే సూచనలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి.

ఇది మూలిగే నక్కపై తాటిపండు చందమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గుజరాత్‌లోనూ అదే జరిగింది. ఆప్‌ గెలిచింది ఐదు స్థానాలే అయినా ప్రధానంగా కాంగ్రెస్‌నే దెబ్బ తీసింది. ఆప్‌ సాధించిన 13 శాతం ఓట్లు కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుకు గండి పెడుతూ సాధించినవే. ‘‘రానున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా ఆప్‌ ముప్పు కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది’’ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.   

చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు)

Advertisement
 
Advertisement
Advertisement